● త్రుటిలో తప్పిన పెను ప్రమాదం
ఆత్మకూరు: షార్ట్సర్క్యూట్ కారణంగా విద్యుత్ మీటరుకు మంటలు వ్యాపించడంతో ఒక్కసారిగా భయపడి ఇంట్లోని వారు రోడ్డుపైకి పరుగులెత్తిన ఘటన ఆత్మకూరు పట్టణంలోని హిల్రోడ్డులో గురువారం మధ్యాహ్నం జరిగింది. స్థానికుల వివరాల మేరకు.. హిల్ రోడ్డులో నివాసం ఉండే విజయలక్ష్మి అనే మహిళ ఇంట్లోని విద్యుత్ మీటరులో ఒక్కసారిగా మంటలు కనిపించాయి. వెంటనే ఇంట్లోని మహిళలు కేకలు వేస్తూ రోడ్డుపైకి వచ్చారు. ఆ సమయంలో రోడ్డుపై వెళ్తున్న షుకూర్ అనే వ్యక్తి ఏఈ జమీలా బేగంకు సమాచారం ఇవ్వడంతో ఆమె సిబ్బందిని పంపి విద్యుత్ సరఫరాను నిలిపివేయించింది. తీవ్రమైన వేసవి కారణంగా ఇలాంటి పరిస్థితి రావడానికి కారణమై ఉంటుందని విద్యుత్ శాఖ సిబ్బంది పేర్కొన్నారు.
గల్లంతైన
యువకుడి మృతి
దగదర్తి: మండల పరిధిలోని చెన్నూరు సమీపంలో కావలి కాలువలో ఈతకు వెళ్లి గల్లంతైన బొడ్డు కార్తీక్ (32) కోసం గురువారం ఉదయం నుంచి పోలీసులు, స్థానికులు కలిసి విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో గల్లంతైన సమీప ప్రాంతంలోనే కార్తీక్ మృతదేహం లభ్యమైనట్లు ఎస్సై మహేంద్ర తెలిపారు. మృతదేహాన్ని పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం నెల్లూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై వెల్లడించారు. కార్తీక్ మృతితో కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.
జెడ్పీ డిప్యూటీ సీఈఓ
బాధ్యతల స్వీకరణ
నెల్లూరు(పొగతోట): జిల్లా పరిషత్ డిప్యూటీ సీఈఓగా బ్రహ్మయ్య బాధ్యతలు స్వీకరించారు. ఈ మేరకు స్థానిక జెడ్పీ కార్యాలయంలో గురువారం బాధ్యతలు చేపట్టారు. అనంతరం ఆయన జెడ్పీ చైర్పర్సన్ ఆనం అరుణమ్మ, సీఈఓ శ్రీధర్రెడ్డిలను మర్యాదపూర్వకంగా కలిశారు.


