ప్రలోభాల ఎరతో అధికార మదంతో ప్రజాస్వామ్యాన్ని అపహస్యం చేసిన టీడీపీ ఎమ్మెల్యే పాశం సునీల్కుమార్ తీరును నిరసిస్తూ ఎంపీపీ ఎన్నికను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బహిష్కరించింది. సభ్యులు అంగట్లో సరుకులా అమ్ముడుబోయి ప్రజాస్వామ్యానికే మాయని మచ్చ తెచ్చారంటూ మండిపడుతూ బయటకెళ్లారు. దీన్ని బ్లాక్ డేగా మాజీ మంత్రి, పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్రెడ్డి, తిరుపతి ఎంపీ గురుమూర్తి, ఎమ్మెల్సీ, పార్టీ గూడూరు నియోజకవర్గ ఇన్చార్జి మేరిగ మురళీధర్ అభివర్ణించారు. రాజ్యాంగాన్ని అపహస్యం చేసిన టీడీపీ ఎమ్మెల్యే తీరును ఎండగట్టారు.


