నేత్రపర్వం.. సాయినాథుడి నగరోత్సవం
నెల్లూరు(బృందావనం) : సాయినామ సంకీర్తనలు, మంగళ వాయిధ్యాలు, తీన్మార్ బ్యాండ్ మేళాలు, పండరి భజనలు, కోలాటాల నడుమ సాయినాథుడి దివ్యరథ నగరోత్సవం బాలాజీనగర్ శివారులోని పద్మావతినగర్లో గురువారం రాత్రి నేత్రపర్వంగా సాగింది. శ్రీరామనవమి వేడుకల్లో భాగంగా మందిర మేనేజింగ్ ట్రస్టీ మధుసాయి ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకలకు భక్తులు విశేషంగా తరలివచ్చారు. ఉదయం 6 గంటలకు సాయినాథుడికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు. సాయిమాత నిత్యాన్నప్రసాద నిలయం, శ్రీసాయి సేవాలయాల్లో సీతారాముల కల్యాణ మహోత్సవం వైభవంగా జరిగింది. అనంతరం సుమారు 8 వేల మందికి అన్నప్రసాదాలు అందించారు. సాయంత్రం 6 గంటలకు విష్ణు సహస్రనామ సామూహిక పారాయణం జరిగింది. అనంతరం ప్రత్యేకంగా అలంకరించిన రథంపై సాయినాథుడి చిత్రపటాన్ని ప్రతిష్టించారు. పద్మావతినగర్, బాలాజీనగర్, ఏసీనగర్ తదితర ప్రాంతాల మీదుగా నగరోత్సవం సాగింది. కార్యక్రమాలను మందిరం గౌరవ సలహాదారు రామసుబ్బయ్య, శ్రీసాయి భక్తబృందం పర్యవేక్షించింది.