టీమిండియా ప్రాక్టీస్‌ కోసం బీసీసీఐ మాస్టర్‌ ప్లాన్‌‌

Team India Set To Play T20 Series Against South Africa And New Zealand Before T20 World cup - Sakshi

ముంబై: ఈ ఏడాది చివ‌ర్లో జ‌రుగ‌బోయే టీ20 ప్రపంచక‌ప్‌కు ముందు టీమిండియా లక్కీ ఛాన్స్‌ కొట్టేసింది. ప్రపంచక‌ప్‌కు ముందు భారత జట్టు టీ20 ఫార్మాట్‌కు అల‌వాటు ప‌డాల‌న్న ఉద్దేశంతో ఈ ఏడాది అక్టోబ‌ర్‌లో దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్‌ల‌తో టీ20 సిరీస్‌లు నిర్వ‌హించాలని బీసీసీఐ భావిస్తోంది. దీనికి సంబంధించి ఆయా దేశాల క్రికెట్‌ బోర్డుల‌తో విధివిధానాలను రూపొందించ‌నున్న‌ట్లు ఓ బీసీసీఐ అధికారి వెల్ల‌డించారు. కాగా, క‌రోనా కార‌ణంగా గ‌తేడాది మార్చిలో భారత్‌, దక్షిణాఫ్రికాల మధ్య జరగాల్సిన సిరీస్ అర్ధంతరంగా ర‌ద్ద‌యిన నేపథ్యంలో భారత్‌కు ఈ అవకాశం లభించనున్నట్లు టీమిండియా మేనేజ్‌మెంట్‌ భావిస్తోంది. 

కాగా, ప్రస్తుత షెడ్యూల్ ప్రకారం ఇంగ్లండ్‌తో సిరీస్ ముగిసిన త‌ర్వాత ప్రపంచక‌ప్ వ‌ర‌కు టీమిండియాకు టీ20 సిరీస్‌లు లేవు. ఇంగ్లండ్‌తో సిరీస్‌ అయిపోయిన వెంటనే ఐపీఎల్,  ఆత‌ర్వాత ఇంగ్లండ్‌ పర్యటనలో టెస్ట్‌ మ్యాచ్‌లు, అనంతరం సెప్టెంబ‌ర్‌లో ఆసియా క‌ప్‌లో వన్డే మ్యాచ్‌లు.. ఇలా అన్నీ ఇతర ఫార్మాట్‌ సిరీస్‌లనే టీమిండియా ఆడనుంది. దీంతో జట్టు సభ్యులు టీ20 ఫార్మాట్‌కు అలవాటుపడాలన్న ఉద్ధేశంతో బీసీసీఐ మాస్టర్‌ ప్లాన్‌ను రూపొందించనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం టీమిండియా ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను ఆడుతుంది. ఇప్పటివరకున్న షెడ్యూల్‌ ప్రకారమైతే జట్టుగా ప్రపంచకప్‌కు ముందు టీమిండియాకు ఇదే ఆఖరి టీ20 సిరీస్‌. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top