సూర్యకుమార్ యాదవ్ దూకుడు
అబుదాబి: రాజస్తాన్ రాయల్స్తో జరుగుతున్న మ్యాచ్లో ముంబై ఇండియన్స్ 194 పరుగుల టార్గెట్ను నిర్దేశించింది. సూర్యకుమార్ యాదవ్(79 నాటౌట్ 47 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్స్లు), రోహిత్ శర్మ(35; 23 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్లు)లు రాణించడంతో పోరాడే స్కోరును బోర్డుపై ఉంచింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ తీసుకోవడంతో ఇన్నింగ్స్ను డీకాక్, రోహిత్ శర్మలు ధాటిగా ఆరంభించారు. డీకాక్(23;15 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్) తొలి వికెట్గా ఔటయ్యాడు. దాంతో 46 పరుగులు వద్ద ముంబై ఇండియన్స్ మొదటి వికెట్ పడింది. కార్తీక్ త్యాగి బౌలింగ్లో బట్లర్కు క్యాచ్ ఇచ్చి డీకాక్ పెవిలియన్ చేరాడు. (చదవండి: భువీ స్థానంలో పృథ్వీ రాజ్ యర్రా)
అనంతరం రోహిత్ శర్మతో కలిసి సూర్యకుమార్ యాదవ్ ఇన్నింగ్స్ను నడిపించాడు. కాగా, జట్టు స్కోరు 88 పరుగుల వద్ద రోహిత్ రెండో వికెట్గా ఔటయ్యాడు. శ్రేయస్ గోపాల్ బౌలింగ్లో రాహుల్ తెవాటియా క్యాచ్ పట్టడంతో రోహిత్ ఇన్నింగ్స్ ముగిసింది. ఆపై వెంటనే ఇషాన్ కిషన్(0) గోల్డెన్ డక్గా నిష్ర్కమించాడు. వచ్చీ రావడంతోనే భారీ షాట్కు యత్నించి పెవిలియన్ చేరాడు. అటు తర్వాత వచ్చిన కృనాల్(12) పెద్దగా ఆకట్టుకోలేదు. మరొక ఎండ్లో సూర్యకుమార్ నిలకడగా ఆడటంతో పాటు హార్దిక్ పాండ్యా నుంచి సహకారం లభించడంతో ముంబై తిరిగి తేరుకుంది. హార్దిక్ పాండ్యా 19 బంతుల్లో 2 ఫోర్లు , 1సిక్స్తో 30 పరుగులు చేయడంతో ముంబై నిర్ణీత ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 193 పరుగులు చేసింది. రాజస్తాన్ బౌలర్లలో శ్రేయస్ గోపాల్ రెండు వికెట్లు సాధించగా, ఆర్చర్, త్యాగిలకు తలో వికెట్ దక్కింది.