షార్జా స్టేడియాన్ని చుట్టేసిన దాదా
దుబాయ్ : ఐపీఎల్ 2020 సీజన్ ప్రారంభానికి ఇంకా నాలుగు రోజులే మిగిలిఉంది. ఇప్పటికే లీగ్లో పాల్గొనే జట్లన్నీ తమ ప్రాక్టీస్లో నిమగ్నమయ్యాయి. ఈసారి ఐపీఎల్లో మ్యాచ్లన్నీ షార్జా, దుబాయ్, అబుదాబి వేదికగా జరగనున్నాయి. కాగా సెప్టెంబర్ 9న దుబాయ్ వెళ్లిన బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ నిబంధనల ప్రకారం ఆరు రోజల క్వారంటైన్ పూర్తి చేసుకొని ఐపీఎల్ 13వ సీజన్కు సంబంధించిన పనులను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నాడు. తాజాగా మంగళవారం ఐపీఎల్ ఛైర్మన్ బ్రిజేష్ పటేల్, సీవోవో హేమంగ్ అమిన్తో కలిసి దాదా షార్జా స్టేడియం పరిసరాలను సందర్శించాడు. (చదవండి : 6 నెలల తర్వాత తొలిసారి విమానం ఎక్కా)
ఈ సందర్భంగా గంగూలీ తన ఇన్స్టాగ్రామ్లో షార్జా స్టేడియం ఫోటోలను షేర్ చేశాడు. ' కరోనా నేపథ్యంలో ఈసారి ఐపీఎల్ దుబాయ్లో జరుగుతుంది. మ్యాచ్లు జరగనున్న షార్జా స్టేడియం అంటే నాకు చాలా ఇష్టం. ఈ ఐకానిక్ స్టేడియంలో నాకు ఎన్నో మధుర స్మృతులు ఉన్నాయి. ఐపీఎల్ ద్వారా భారత యువ ఆటగాళ్లు షార్జా స్టేడియంలో మ్యాచ్లు ఆడేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. భారత దిగ్గజాలు సునీల్ గవాస్కర్, సచిన్ టెండూల్కర్ లాంటి ఆటగాళ్లకు కూడా ఈ స్టేడియంలో మంచి జ్ఞాపకాలు ఉన్నాయి.' అని పేర్కొన్నాడు.
కాగా టీమిండియా మాజీ కెప్టెన్ గంగూలీకి షార్జా స్టేడియంలో ఘనమైన రికార్డు ఉంది. ఒక సెంచరీ, ఐదు హాఫ్ సెంచరీలతో మొత్తం 700 పరుగులకు పైగా సాధించాడు. ఐపీఎల్ 13వ సీజన్ మూడు వేదికల్లో ఒకటైన షార్జాలో మొత్తం 12 మ్యాచ్లకు ఆతిథ్యమివ్వనుంది. సెప్టెంబర్ 22న చెన్నై సూపర్ కింగ్స్, రాజస్తాన్ రాయల్స్ మధ్య ఈ స్టేడియంలో తొలిమ్యాచ్ జరగనుంది. (చదవండి : నెట్ బౌలర్గా అర్జున్ టెండూల్కర్!)