రాజస్తాన్‌ది అదే కథ.. అదే వ్యథ

Delhi Beat Rajasthan By 46 Runs - Sakshi

ఈ ఐపీఎల్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌కు కలిసొచ్చిన స్టేడియం ఏదైనా ఉందంటే అది షార్జా.  ఇక్కడ వరుసగా రెండు మ్యాచ్‌లు గెలిచిన రాజస్తాన్‌.. వేరే వేదికల్లో ఆడిన మ్యాచ్‌ల్లో హ్యాట్రిక్‌ పరాజయాలు చూసింది. అయితే మళ్లీ రాజస్తాన్‌ ఆడే మ్యాచ్‌ వేదిక షార్జాకు షిప్ట్‌ అయ్యింది. దాంతో రాజస్తాన్‌ గాడిలో పడుతుందనుకున్నారంతా. కలిసొచ్చిన స్టేడియం కావడంతో రాజస్తాన్‌ బ్యాటింగ్‌ విన్యాసాలు చూద్దామని అభిమానులు ఆశించారు. కానీ రాజస్తాన్‌ కథ మారలేదు.  వరుస మ్యాచ్‌లో చవిచూసిన తీవ్ర పరాభవమే ఇక్కడా ఎదురైంది. కనీసం పోరాటం చేయకుండానే ఢిల్లీ క్యాపిటల్స్‌కు లొంగిపోయింది రాజస్తాన్‌. బ్యాటింగ్‌లో పూర్తి వైఫల్యంలో స్టీవ్‌ స్మిత్‌ ఏమాత్రం పోటీ ఇవ్వకుండా లొంగిపోతే, బ్యాటింగ్‌లో పట్టుదల, నిర్దాక్షిణ్యమైన బౌలింగ్, అంతకంటే అద్భుతమైన ఫీల్డింగ్‌ వెరసి శ్రేయస్‌ అండ్‌ గ్యాంగ్‌కు అద్భుతమైన విజయాన్ని సాధించిపెట్టాయి.

షార్జా:  రాజస్తాన్‌ రాయల్స్‌ను జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌  46 పరుగుల తేడాతో విజయం సాధించింది. రాజస్తాన్‌ బ్యాటింగ్‌లో యశస్వి జైస్వాల్‌(34; 36 బంతుల్లో 1 ఫోర్‌, 2 సిక్స్‌లు), స్టీవ్‌ స్మిత్‌(24; 17 బంతుల్లో 2 ఫోర్లు, 1సిక్స్‌), జోస్‌ బట్లర్‌(13; 8 బంతుల్లో 2 ఫోర్లు), తెవాటియా(38; 29 బంతుల్లో 3 ఫోర్లు, 2సిక్స్‌లు)లు మినహా ఎవరూ రెండంకెల స్కోరును దాటలేదు. రాజస్తాన్‌ బ్యాటింగ్‌ లైనప్‌లో ఏడుగురు సింగిల్‌ డిజిట్‌కే పరిమితం కావడంతో ఆ జట్టు 19.3 ఓవర్లలో 138 పరుగులకే ఆలౌటై ఘోర ఓటమి చవిచూసింది.

ఢిల్లీ నిర్దేశించిన 185 పరుగుల టార్గెట్‌ ఛేదనలో రాజస్తాన్‌ 15 పరుగులకే బట్లర్‌ వికెట్‌ను కోల్పోయింది. ఆపై స్మిత్‌-జైశ్వాల్‌లు స్కోరు బోర్డును చక్కదిద్దే యత్నం చేసినా ఎంతసేపో లేదు.  జట్టు స్కోరు 56 పరుగుల వద్ద రాజస్తాన్‌ స్మిత్‌ వికెట్‌ను కోల్పోగా కాసేపటికి సంజూ శాంసన్‌(5) ఔటయ్యాడు. స్టోయినిస్‌ బౌలింగ్‌లో భారీ షాట్‌ ఆడే యత్నం చేసి శాంసన్‌ పెవిలియన్‌ చేరాడు. ఆ తర్వాత రాజస్తాన్‌ వరుసగా వికెట్లు కోల్పోతూ వచ్చింది. ఢిల్లీ బౌలర్లలో రబడా మూడు వికెట్లు సాధించగా, స్టోయినిస్‌, అశ్విన్‌లు తలో రెండు వికెట్లు సాధించారు. హర్షల్‌, నోర్త్‌జే, అక్షర్‌ పటేల్‌లకు ఒక్కో వికెట్‌ లభించింది.(చదవండి: నేను రన్స్‌ ఇవ్వడం కాదు.. వారు కొడుతున్నారు!)

ముందుగా బ్యాటింగ్‌ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్‌ ఎనిమిది వికెట్ల  నష్టానికి 184 పరుగులు చేసింది. హెట్‌మెయిర్‌(45; 24 బంతుల్లో 1 ఫోర్‌, 5 సిక్స్‌లు), మార్కోస్‌ స్టోయినిస్‌(39; 30బంతుల్లో 4 సిక్స్‌లు), శ్రేయస్‌ అయ్యర్‌(22;18 బంతుల్లో 4 సిక్స్‌లు)లు ఢిల్లీ గౌరవప్రదమైన స్కోరు చేయడంలో సహకరించారు. టాస్‌ గెలిచిన రాజస్తాన్‌ ముందుగా ఫీల్డింగ్‌ తీసుకోవడంతో ఢిల్లీ బ్యాటింగ్‌కు దిగింది. ఢిల్లీ బ్యాటింగ్‌ను పృథ్వీ షా, శిఖర్‌ ధావన్‌ ఆరంభించారు. అయితే జోఫ్రా ఆర్చర్‌ వేసిన రెండో ఓవర్‌లో ధావన్‌(5) తొలి వికెట్‌గా పెవిలియన్‌కు చేరగా, పృథ్వీషా(19) కూడా ఎక్కువ సేపు క్రీజ్‌లో నిలవలేదు. ఆర్చర్‌ వేసిన ఐదో ఓవర్‌లో పృథ్వీ షా ఔటయ్యాడు. 

కాసేపటికి శ్రేయస్‌ అయ్యర్‌(22; 18 బంతుల్లో 4 ఫోర్లు) ఔటయ్యాడు. దాంతో ఢిల్లీ 50 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. రిషభ్‌ పంత్‌(5) రనౌట్‌గా ఔటయ్యాడు. అనవసరపు పరుగు కోసం క్రీజ్‌ దాటి ముందుకు రావడంతో రాహుల్‌ తెవాటియా విసిరిన అద్భుతమైన త్రోకు పంత్‌ ఔటయ్యాడు. ఆ తరుణంలో హెట్‌మెయిర్‌-స్టోయినిస్‌ల జోడి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దింది. ముందు స్టోయినిస్‌ సిక్స్‌లతో విరుచుకుపడితే, ఆపై హెట్‌మెయిర్‌ ఎదురుదాడికి దిగాడు. స్టోయినిస్‌ ఔటైన తర్వాత హెట్‌మెయిర్‌ బౌండరీలే లక్ష్యంగా ఆడాడు. చివర్లో హర్షల్‌ పటేల్‌(16 నాటౌట్‌), అక్షర్‌ పటేల్‌(17) బ్యాట్‌ ఝుళిపించడంతో ఢిల్లీ పోరాడే స్కోరును బోర్డుపై ఉంచింది. రాజస్తాన్‌ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్‌ మూడు వికెట్లు సాధించగా, కార్తీక్‌ త్యాగి, ఆండ్రూ టై, రాహుల్‌ తెవాటియా తలో వికెట్‌ సాధించారు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top