దుబ్బాకటౌన్: కౌమార బాలికల ఆరోగ్య సంరక్షణకు ప్రభుత్వం వైద్య పరీక్షలు నిర్వహిస్తోందని, తల్లిదండ్రులు కూడా ఎప్పటికప్పుడు బాలికల్లో తరచూ వచ్చే అనారోగ్య సమస్యలను గమనిస్తుండాలని మున్సిపల్ చైర్పర్సన్ సంగీ త అన్నారు. ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక కార్యాచరణలో భాగంగా మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన కౌమార బాలికల ఆరోగ్య పరీక్షల శిబిరాన్ని ఆమె ప్రారంభించారు. తిమ్మాపూర్ పీహెచ్సీ సహకారంతో మెప్మా ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన ఈ కార్యకమ్రంలో మున్సిపల్ కమిషనర్ కె.రమేశ్కుమార్ పాల్గొన్నారు. స్వయం సహాయక సంఘాల్లో సభ్యులైన మహిళా కుటుంబాల్లోని కిషోర బాలికలకు రక్తహీనత, హిమోగ్లోబిన్, షుగర్ స్థాయిని తెలిపే రక్తపరీక్షలు, ఎత్తు, బరువులను పరీక్షించి, అవసరమైన వారికి ఉచితంగా మందులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కౌమారదశలో ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా భవిష్యత్లో అనేక వ్యాధులను దూరం చేసుకోవచ్చన్నారు. పోషకాహారం, పరిశుభ్రత, వైద్యుల సలహాలు పాటించడం ద్వారా సమస్యలను అధిగమించవచ్చని సూచించారు. కార్యక్రమంలో మెప్మా సీఓ రేణుక, ఎంఎల్హెచ్ పి.స్రవంతి, హెల్త్ అసిస్టెంట్ గణేశ్, ఏఎన్ఎం పుష్ప, ఆశాకార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


