కలెక్టర్ హైమావతి
సిద్దిపేటజోన్: వచ్చేపది రోజులు అత్యంత కీలకమని, ప్రతి కొనుగోలు కేంద్రం వద్ద అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ హైమావతి సూచించారు. సోమవారం ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ భవనంలో వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియపై సివిల్ సప్లై, డీఆర్డీఏ, పీఏసీఎస్, రెవెన్యూ, మార్కెటింగ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రణాళిక ప్రకారం ధాన్యాన్ని లిఫ్టింగ్ చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ధాన్యం లోడింగ్లో ఎలాంటి జాప్యం జరగకుండా చూడాలన్నారు. లారీల కొరత లేకుండా చూడాలని రవాణా శాఖ అధికారులకు సూచించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులు సమన్వయంతో పనిచేసి కొనుగోలు ప్రక్రియ జరపాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సివిల్ సప్లై అధికారి తనూజ, డీఆర్డీఓ జయదేవ్ ఆర్య, డీఎం మార్కెటింగ్ నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
ఈవీఎం గోదాం పరిశీలన..
కలెక్టరేట్ పక్కన ఉన్న ఈవీఎం గోదాంను కలెక్టర్ హైమావతి పరిశీలించారు. ఈ సందర్భంగా లాగ్ బుక్ పరిశీలించి, విజిటర్ రిజిస్టర్లో సంతకం చేశారు. సీసీ కెమెరాల పనితీరు, పోలీసు అధికారుల బందోబస్తు గురించి ఆరా తీశారు. ఈవీఎం గోదాం పరిసర ప్రాంతాన్ని పర్యవేక్షించాలని రెవెన్యూ అధికారులకు సూచించారు.


