ఒకరి పరిస్థితి విషమం
● బైక్ను ఢీకొట్టిన కర్నాటక ఆర్టీసీ బస్సు ● ప్రమాదంలో ఇద్దరు మృతి ● 10 మందికి గాయాలు
రోడ్డు ప్రమాదంలో
ఐదుగురికి తీవ్ర గాయాలు
నంగునూరు(సిద్దిపేట): ఐదుగురికి రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలు కాగా ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ సంఘటన మంగళవారం బద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గుంపాడు మండలం, సారపాక వద్ద చోటు చేసుకుంది. సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం వెంకటాపూర్కు చెందిన పులిగిల్ల లింగప్రసాద్, బొమ్మిడి శ్రీనివాస్రెడ్డి, నక్క కుమార్, నర్మేటకు చెందిన చంద్రశేఖర్, అప్పలాయిచెర్వుకు చెందిన సంపత్రెడ్డి హనుమాన్ మాలవేశారు. కారులో బద్రాచలం వెళ్లి మాల విరమణ అనంతరం విజయవాడకు వెళ్తున్నారు. ఈ క్రమంలో కట్టెల లోడ్తో వెళ్తున్న ట్రాక్టర్ను వెనుక నుంచి కారు ఢీకొట్టడంతో వీరికి తీవ్ర గాయాలయ్యాయి. లింగప్రసాద్ పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్లోని ఓప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. కాగా మిగతా వారు సిద్దిపేటలో చికిత్స పొందుతున్నారు.
న్యాల్కల్(జహీరాబాద్): రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా మరో పది మందికి గాయాలయ్యాయి. ఈ ఘటన బీదర్ శివారులో బీదర్–జహీరాబాద్ రోడ్డుపై చోటు చేసుకుంది. బీదర్ పోలీసులు, బాధితుల కథనం ప్రకారం... మండల పరిధిలోని మిర్జాపూర్(బి)కి చెందిన పంచలింగాల నర్సింహులు, నాగన్న అన్నదమ్ములు. నర్సింహులు(50), నాగన్న కుమారుడు వరుణ్ కుమార్(20)తో కలిసి ఒక బైక్పై, నర్సింహులు భార్య లక్ష్మి, కుమారుడు శ్రీకాంత్ మరో బైక్పై బీదర్ సమీపంలో కౌటలోని బంధువుల వివాహానికి వెళ్తున్నారు. ఈ క్రమంలో బీదర్ నుంచి జహీరాబాద్ వైపు వెళ్తున్న బీదర్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఎదురుగా వస్తున్న వీరి బైక్ను ఢీకొట్టింది. దీంతో బైక్పై ఉన్న నర్సింహులు, వరుణ్ కుమార్ అక్కడికక్కడే మృతి చెందారు. ముందు వెళ్లిన నర్సింహులు భార్య, కుమారుడు ప్రమాదం నుంచి బయటపడ్డారు. బస్సు రోడ్డు పక్కకు దూసుకెళ్లి బోల్తా పడింది. బస్సులో 13 మంది ప్రయాణికులు, డ్రైవర్, కండక్టర్ ఉన్నారు. డ్రైవర్ శ్రీమంత్, కండక్టర్ రవి కుమార్తో పాటు 8 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. వారిని వెంటనే బీదర్లోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఘటనా స్థలాన్ని జహీరాబాద్ డీఎస్పీ సైదా నాయక్ సందర్శించారు.
ప్రాణాలు కాపాడిన చెట్టు
రోడ్డు ప్రమాదంలో ప్రయాణికులు, సిబ్బంది ప్రాణాలను ఓ చెట్టు కాపాడింది. వేగంగా వెళ్తూ రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీకొట్టిన బస్సు వేగం తగ్గి బోల్తాపడింది. ఆ చెట్టు అడ్డు తగలకుండా ఉండి ఉంటే ప్రాణ నష్టం జరగడంతో పాటు అనేక మంది క్షతగాత్రులయ్యేవారు.
బైక్ అదుపు తప్పి
వృద్ధుడు..
మిరుదొడ్డి(దుబ్బాక): బైక్ అదుపు తప్పి కిందపడటంతో వృద్ధుడు మృతి చెందాడు.ఈ ఘటన మండల పరిధిలోని ధర్మారం శివారులో సోమవారం రాత్రి చోటు చేసుకుంది. స్థానికుల వివరాలు ఇలా... మండల పరిధిలోని లక్ష్మీనగర్ గ్రామ పంచాయతీ పరిధిలోని ఆరెపల్లి గ్రామానికి చెందిన గువ్వాడి సంజీవ రావు (67) సోమవారం బెజ్జంకిలోని బంధువుల ఇంటికి బైకుపై వెళ్లాడు. అదే రోజు రాత్రి ఇంటికి తిరుగు ప్రయాణమయ్యాడు. ఈ క్రమంలో ధర్మారం శివారులోకి రాగానే బైక్ అదుపు తప్పి కింద పడి తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. వాహనదారులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని సిద్దిపేటలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
కారు ఢీకొట్టడంతో ఒకరు..
టేక్మాల్(మెదక్): రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన మండలంలోని బొడ్మట్పల్లి హైవేపై మంగళవారం చోటు చేసుకుంది. ఏఎస్ఐ కృష్ణ వివరాల ప్రకారం.. మండలంలోని కోరంపల్లి గ్రామానికి చెందిన తెల్లగొల్ల హన్మంతు(60) వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. హన్మంతుకు ఇద్దరు భార్యలు. కాగా హన్మంతు రెండో భార్య ఇంటి(సాలోజిపల్లి) నుంచి ఈనెల 11న టీవీఎస్పై సంగారెడ్డికి వెళ్లాడు. ఉదయం ఇంటికి తిరిగి వస్తుండగా బొడ్మట్పల్లి వద్ద హైవేపై రోడ్డు క్రాస్ చేసే క్రమంలో అతివేగంతో హైదరాబాద్ వెళ్తున్న కారు హన్మంతును ఢీకొట్టింది. దీంతో తీవ్ర గాయాలైన అతడ్ని జోగిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యుడు పరీక్షించి మృతిచెందినట్లు తెలిపారు.
మృతుడు నర్సింహులు
వరుణ్ కుమార్


