కలెక్టర్ ప్రతీక్ జైన్
సంగారెడ్డి జోన్: ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణమే పరిష్కరించే దిశగా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ ప్రతీక్ జైన్ అధికారులను ఆదేశించారు. ప్రజావాణి కార్యక్రమానికి వచ్చే ప్రతీ ఫిర్యాదును స్వీకరించి, నిర్ణీత గడువులో పరిష్కరించాలని సూచించారు. కలెక్టరేట్లోని గ్రీవెన్స్హాల్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ...సంగారెడ్డి పట్టణంలోని పలు ప్రాంతాల్లో మ్యాన్హోల్స్ తెరిచి ఉండటం ప్రమాదకరమని, ప్రమాదాలు జరగకముందే వాటిని పరిశీలించి వెంటనే మూసివేయాలని మున్సిపల్ కమిషనర్ను ఆదేశించారు. ఆర్ అండ్ బీ రోడ్ల డివైడర్లపై ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తొలగించాలని సూచించారు. జిల్లాలో డివిజన్ వారీగా నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమాల్లో మొత్తం 108 ఫిర్యాదులు వచ్చాయని, అందులో కలెక్టరేట్లో 23, సంగారెడ్డి డివిజన్కు 27, ఆందోల్ 03, ఖేడ్ 27, జహీరాబాద్ డివిజన్కు 29 ఫిర్యాదులు అందినట్లు వెల్లడించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు సంగీత, పాండు, జిల్లా అధికారులు, రెవెన్యూ డివిజనల్ అధికారులు, మున్సిపల్ కమిషనర్లు పాల్గొన్నారు.
జనగణనలో భాగస్వాములవ్వాలి
జనగణన–2027 కార్యక్రమంపై ప్రజల్లో అవగాహన కల్పించే ఉద్దేశంతో మంగళవారం ఉదయం 7:30 గంటలకు కలెక్టరేట్ ఐబీ వరకు మారథాన్ రన్ నిర్వహించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. ప్రతీ ఒక్కరు మారథాన్రన్లో స్వచ్ఛందంగా పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. అదేవిధంగా జిల్లాలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను వేగవంతం చేయాలని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్రెడ్డి హైదరాబాద్ నుంచి సంబంధిత ఉన్నతాధికారులతో కలిసి ఎస్ఐఆర్ ప్రక్రియపై అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు.
ఇంటర్ సప్లిమెంటరీకి ఏర్పాట్లు
సంగారెడ్డి ఎడ్యుకేషన్: జిల్లాలో ఈ నెల 13 నుంచి 21 వరకు నిర్వహించనున్న ఇంటర్మీడియెట్ సప్లిమెంటరీ పరీక్షలు సజావుగా, ప్రశాంత వాతావరణంలో జరిగేలా అన్ని శాఖలు సమన్వయంతో పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ప్రతీక్ జైన్ సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ మినీ సమావేశ మందిరంలో సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణపై సంబంధిత శాఖల అధికారులతో నిర్వహించిన కో ఆర్డినేషన్ కమిటీ సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. జిల్లాలో ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలకు 13,862 మంది విద్యార్థులు హాజరుకానున్నారని, అందులో మొదటి ఏడాది పరీక్షలకు 9,591 మంది, ద్వితీయ సంవత్సరం పరీక్షలకు 4,271మంది హాజరవుతున్నట్లు వెల్లడించారు. జిల్లాలో 27 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సమావేశంలో అదనపు ఎస్పీ చైతన్యరెడ్డి, జిల్లా ఇంటర్మీడియెట్ అధికారి గోవిందరామ్, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.


