● ఎమ్మెల్యే సంజీవరెడ్డి ● పుల్కుర్తి కేజీబీవీ తరగతి నిర్మాణానికి శంకుస్థాపన ● గురుకులంలో మరమ్మతులకు శ్రీకారం
నారాయణఖేడ్: మారుతున్న కాలంతోపాటు సాంకేతికతను పరిజ్ఞానాన్ని విద్యార్థులు అందిపుచ్చుకుని వృద్ధి సాధించాలని ఎమ్మెల్యే సంజీవరెడ్డి సూచించారు. నియోజకవర్గంలోని మనూరు మండలం పుల్కుర్తి కేజీబీవీ పాఠశాలలో రూ.44 లక్షలతో అదనపు తరగతి గది నిర్మాణానికి, ఖేడ్ మండలం జూకల్ శివారులోని మహాత్మాజ్యోతిబాపూలే బీసీ బాలుర గురుకులంలో రూ.45 లక్షలతో చేపట్టనున్న మరమ్మతు పనులను సోమవారం ఆరంభించారు. మనూరు జూనియర్ కళాశాలలో విద్యార్థులకు బోధనకు అవసరమైన ఎల్ఈడీ టీవీలను ప్రారంభించారు. నిజాంపేట్ మండలం జంబికుంట గ్రామంలో, మనూరు మండలం ఎల్గొయి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించి గృహప్రవేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..ప్రభుత్వ విద్యాసంస్థల్లో మెరుగైన వసతులు కల్పించి నాణ్యమైన విద్యను అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. నిధుల సమస్య లేకుండా విద్యా సంస్థల అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పారు. విద్యార్థుల్లో దాగివున్న నైపుణ్యాలను వెలికితీయడమే వేసవి శిబిరాల లక్ష్యమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఖేడ్ పీఎంశ్రీ జిల్లా పరిషత్ ఉన్నతపాఠశాలలో సమ్మర్ క్యాంపులను ఆయన ప్రారంభించారు. పదోతరగతిలో ప్రతిభ చూపిన విద్యార్థులను సన్మానించారు. కార్యక్రమంలో డిగ్రీకళాశాల ప్రిన్సిపాల్ నారాయణ, జ్యోతిబాపూలే ప్రిన్సిపాల్ ప్రతిభ, ఆయా విద్యాసంస్థల ఉపాధ్యాయులు, కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.


