క్లుప్తంగా
దుబ్బాకటౌన్: దౌల్తాబాద్ మండలం గువ్వలేగి గ్రామానికి చెందిన కట్టెగుమ్ముల సాత్విక లాంగ్ జంప్లో ప్రతిభ కనబరిచింది. హనుమకొండలో నిర్వహించిన రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో 2 స్థానం సాధించి సిల్వర్ మెడల్ కై వసం చేసుకుంది. గ్రామీణ ప్రాంతానికి చెందిన విద్యార్థిని రాష్ట్రస్థాయిలో ప్రతిభ కనబరచడంతో మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు అల్లి శేఖర్ రెడ్డి, గ్రామస్తులు, క్రీడాకారులు ఆమెను అభినందించారు. భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు.
కార్మికులపై తేనెటీగల దాడి
హత్నూర(సంగారెడ్డి): పారిశుద్ధ్య కార్మికులపై తేనెటీగలు దాడి చేశాయి. ఈ సంఘటన మండల కేంద్రమైన హత్నూరలో సోమవారం చోటుచేసుకుంది. కార్మికులు వాటర్ ట్యాంకు వద్ద పైపులైన్ లీకేజీ మరమ్మతులు చేస్తున్న క్రమంలో ఒక్కసారిగా తేనెటీగలు కార్మికులపై దాడి చేశాయి. దీంతో తీవ్ర ఆందోళనకు గురైన కార్మికులను సర్పంచ్ ఎల్లయ్యతో పాటు స్థానిక నాయకులు వెంటనే ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. ఈ విషయమై గ్రామపంచాయతీ కార్యదర్శి మజార్ను సాక్షి ఫోన్ ద్వారా సంప్రదించగా.. తమకు సమాచారం అందలేదని, చికిత్స అనంతరం విషయం తెలిసిందని సమాధానం ఇచ్చారు.
చిరుతపులి దాడిలో దూడ మృతి
కల్హేర్(నారాయణఖేడ్): చిరుతపులి దాడి లో దూడ మృతి చెందింది. ఆదివారం రాత్రి మండలంలోని బీబీపేట్ శివారులో ఈ సంఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన రైతు జుమ్మ బీర్గోండ పొలం వద్ద పశువులను కట్టేసి ఇంటికి వచ్చాడు. ఉదయం వెళ్లి చూడగా దూడ మరణించి ఉంది. ఫారెస్టు సెక్షన్ ఆఫీసర్ రాములు, బీట్ ఆఫీసర్ కృష్ణగౌడ్ సంఘటన స్థలాన్ని సందర్శించారు. అక్కడే పంచనామ నిర్వహించారు. కొంత కాలంగా చిరుత పులి సంచరిస్తుండటంతో చుట్టుపక్కల గ్రామస్తులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.


