ఎమ్మెల్యే మహిపాల్రెడ్డి
పటాన్చెరు: పోటీ ప్రపంచంలో మానసిక ప్రశాంతత, శారీరక దారుఢ్యత కోసం విద్యార్థి దశ నుంచే క్రీడలపై ఆసక్తి పెంపొందించేలా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ప్రోత్సహించాలని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సూచించారు. నియోజకవర్గంలో క్రీడలు, క్రీడాకారుల అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తున్నామని ఆయన తెలిపారు. పటాన్చెరు డివిజన్ పరిధిలోని భారతరత్న పీవీ నరసింహారావు ఆడిటోరియంలో ఆదివారం లక్కీ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన గూడెం విష్ణువర్ధన్ రెడ్డి స్మారక 10 జాతీయ స్థాయి కరాటే ఛాంపియన్ షిప్ పోటీలకు ఎమ్మెల్యే హాజరై మాట్లాడారు. పదేళ్లుగా జాతీయ స్థాయిలో కరాటే పోటీలకు వివిధ రాష్ట్రాల నుంచి రెండు వేల మంది క్రీడాకారులు హాజరుకావడం సంతోషకరమన్నారు. పట్టణంలోని మైత్రి మైదానాన్ని ఆధునీకరించడంతో పాటు..ఏడాది పొడవునా వివిధ క్రీడ అంశాల్లో రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గ్రామీణ స్థాయి క్రీడాకారుల కోసం నియోజకవర్గ వ్యాప్తంగా మూడు మినీ స్టేడియాలు ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. కరాటే పోటీల నిర్వహణ కోసం ఎమ్మెల్యే రూ.5 లక్షల సొంత నిధులను అందజేశారు.
మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలి
ప్రస్తుత సమాజంలో మాదకద్రవ్యాలు అత్యంత ప్రమాదకరంగా మారాయని. డ్రగ్స్కు దూరంగా ఉండి వాటిని తరిమి కొట్టడంలో ప్రతీ ఒక్కరూ కృషి చేయాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు మెట్టు కుమార్ యాదవ్, అంజయ్య యాదవ్, మాజీ ఎంపీపీ యాదగిరి యాదవ్, అమీన్పూర్ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ నరసింహగౌడ్, దశరథ్రెడ్డి, మాజీ ఎంపీటీసీ రామచంద్రరెడ్డి, మైత్రీ క్లబ్ అధ్యక్షుడు హనుమంత్ రెడ్డి పాల్గొన్నారు.


