హత్నూర(సంగారెడ్డి): అమ్మ జ్ఞాపకార్థంగా అంబలి కేంద్రం, చలివేంద్రాలను ఏర్పాటు చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు. మండలంలోని సిరిపురం గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ మచ్చ నరేందర్ తన తల్లిదండ్రులు మచ్చ వీరమ్మ, శంకరయ్య జ్ఞాపకార్థం.. దశాబ్ద కాలంగా అంబలితో పాటు చలివేంద్రాన్ని ఏర్పాటు చేసి ప్రయాణికుల ఆకలి, దప్పిక తీరుస్తున్నాడు. ప్రతి సంవత్సరం సిరిపురం బస్టాండ్ సమీపంలో ఏర్పాటు చేస్తూ అందరి మన్ననలు పొందుతున్నాడు. తల్లిదండ్రుల జ్ఞాపకార్థం సేవా కార్యక్రమాలు చేయడం సంతోషంగా ఉందని ఆయన తెలిపారు.
సంగారెడ్డి టౌన్: విధి నిర్వహణలో మాతృ సేవలందిస్తూ ఇతరులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. తల్లిదండ్రులు లేని పిల్లలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వసతులు కల్పిస్తూ విద్యవంతులుగా తీర్చిదిద్దేందుకు పట్టణంలో బాలసదనం ఏర్పాటు చేశారు. సుమారు 73 మంది పిల్లలను తన సొంత పిల్లలుగా చూసుకుంటున్నారు ఇన్చార్జి నిర్మల. వైద్య, ఆరోగ్యం, సామాజిక సంక్షేమంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. చిన్నారుల ఆరోగ్య సంరక్షణతో పాటు తల్లికి సంబంధించిన సేవలందిస్తున్నారు. ఇప్పటివరకు సుమారు పదిమందిని చదివించి, పెద్ద చేసి ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగం కల్పించేందుకు కృషి చేశారు.


