సిద్దిపేటకమాన్: పోలీసు ఉద్యోగం అంటే 24గంటలు అప్రమత్తంగా ఉండాలి. మహిళ ఉద్యోగి అయితే మాత్రం డ్యూటీలో సమాజాన్ని, ఇంట్లో కుటుంబాన్ని బ్యాలెన్స్ చేస్తూ రెండింటినీ కాపాడుకోవాలి. పోలీసు కమిషనరేట్ పరిధిలోని సిద్దిపేట టూటౌన్ పోలీసు స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న మహిళా కానిస్టేబుల్ చిత్ర యాదవ్ను ‘‘సాక్షి’’ పలకరించింది. పోలీసు ఉద్యోగం, అమ్మగా నా బాధ్యత నాకు రెండు కళ్లు. ప్రతి రోజు ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి డ్యూటీ అయ్యే వరకు ప్రతి నిమిషం ముఖ్యమైనదే. పిల్లల చదువు, ఆరోగ్యం, ఇంట్లో వంట, ఉద్యోగం ఇలా అన్ని బ్యాలెన్స్ చేస్తూ భర్త శ్రీనివాస్ సహకారంతో ముందుకు వెళ్తున్నాను. అమ్మ ప్రోత్సాహం వల్లే నాకు పోలీసు ఉద్యోగం వచ్చింది. నేను ఉద్యోగానికి వెళ్తే నా ఇద్దరు పిల్లలను అమ్మే చూసుకుంటుంది. లవ్ యూ అమ్మ.. హ్యాపీ మదర్స్ డే.
నాలుగు తరాల అమ్మ
హుస్నాబాద్రూరల్: నవమాసాలు మోసి కనిపించిన పిల్లలు ప్రయోజకులైతే.. ఆ కన్నతల్లి చూసి మురిసిపోతుంది. కొడుకు పిల్లలతో ముచ్చటించి మురిసిపోయి వృద్ధాప్యానికి చేరుకుంటే ఈ జన్మకు చాలనుకుంటారు. మూడుతరాల మునిమనవళ్లను చూసే అదృష్టం కొందరికి ఉంటే.. నాలుగు తరాల పిల్లలతో ఆడుతూ ఆరోగ్యంగా ఉంది ఓ బామ్మ. హుస్నాబాద్ మండలం గాంధీనగర్ గ్రామానికి చెందిన శామంతుల సాయమ్మ 90 ఏళ్ల పైబడిన ఆమె.. మునిమనవరాళ్లతో ముచ్చటిస్తూ ఉత్సాహంగా ఉంటుంది. సాయమ్మ కొడుకు, కోడలు రాజయ్య, మల్లవ్వ. వీరి కొడుకు రమేశ్, విజయ దంపతులకు ఇద్దరు కొడుకులు. పెద్ద మనవడు వెంకటేశ్, సబీనా దంపతులకు హన్సిక, రియాజ్ ఇద్దరు పిల్లలు ఉన్నారు. సాయమ్మ మునిమనవడి పిల్లలతో నిత్యం కలిసి ఆడుతూ సంతోషంగా ఉంది. నాలుగు తరాల పిల్లలను చూసిన బామ్మ అంటూ ఊరిలో అందరూ ఆప్యాయంగా పిలుచుకుంటూరు.


