పటాన్చెరు టౌన్: సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పట్టణంలోని క్యాటిల్ ఫీడ్ దుకాణాలపై శుక్రవారం డ్రగ్స్ శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. ఆక్సిటోసిన్ ఔషధం ఉన్నట్లు అనుమానిస్తున్న సీసాలను స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ శాఖ ఉప సంచాలకులు దాస్ మార్గదర్శకత్వంలో సహాయ సంచాలకులు రాము ప్రత్యక్ష పర్యవేక్షణలో పాశమైలారం డ్రగ్స్ ఇన్న్స్పెక్టర్లు వరప్రసాద్, రవికిరణ్ రెడ్డి, ప్రవీణ్ కుమార్ సంయుక్తంగా దాడులు చేపట్టారు. ముందుగా పటాన్చెరు పరిధిలోని పాటి ఎక్స్ రోడ్డులో రేణుక క్యాటిల్ ఫీడ్ దుకాణంలో తనిఖీలు నిర్వహించగా.. ఆక్సిటోసిన్ ఔషధం ఉన్న 40 సీసాలు గుర్తించారు. అనంతరం సంబంధిత నమూనాలు సేకరించి, మిగిలిన సీసాలను స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా చైతన్య నగర్ కాలనీలోని ఎంఎస్ లక్ష్మీ కృష్ణ క్యాటిల్ ఫీడ్ దుకాణంలో తనిఖీలు చేపట్టగా.. ఆక్సిటోసిన్ ఔషధం ఉన్నట్లు అనుమానిస్తున్న 250 మి.లీ సామర్థ్యం గల 120 సీసాలు లభ్యమయ్యాయి. వీటి నమూనాలు సేకరించి, మిగిలిన పరిమాణాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ రెండు కేసులకు సంబంధించిన వివరాలను సంగారెడ్డి కోర్టుకు సమర్పించినట్లు తెలిపారు.
120 సీసాలు స్వాధీనం చేసుకున్న డ్రగ్స్ అధికారులు


