కొండాపూర్ (సంగారెడ్డి): ధాన్యం తీసుకువచ్చే రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని ఆర్డీఓ రాజేందర్ పీఏసీఎస్ సిబ్బందికి సూచించారు. కొండాపూర్లోని వరి కొనుగోలు కేంద్రాన్ని ఆర్డీఓ బుధవారం తనిఖీ చేసి ధాన్యాన్ని పరిశీలించారు. తేమ శాతం, తూకం వేసే విధానాన్ని పరిశీలించడంతో గన్నీ బ్యాగులు అందుబాటులో ఉన్నాయా లేవా అని పీఏసీఎస్ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే ఓపీఎంఎస్లో నమోదు చేయాలని సూచించారు. వరికి ఏ గ్రేడ్ రకానికి రూ 2,389తోపాటు ప్రభుత్వం అదనంగా రూ.500ను బోనస్ రూపంలో అందిస్తుందన్నారు. అకాల వర్షాలున్నాయని వస్తున్న సమాచారం నేపథ్యంలో ధాన్యం తడవకుండా టార్పాలిన్లను అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల్లో రైతులకు డబ్బులు పడేలా చూడాలన్నారు. దళారులను నమ్మి రైతులు మోసపోవద్దన్నారు. రైతులు తీసుకొచ్చిన చివరి ధాన్యం గింజ వరకు కూడా కొనుగోలు చేస్తామన్నారు. రాజేందర్ వెంట వ్యవసాయ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ వైద్యనాథ్, తహసీల్దార్ అశోక్, వ్యవసాయాధాకారి గణేశ్ ఏఈఓ ప్రేమ్రాజ్, పీఏసీఎస్ సీఈఓ సిరాజ్ తదితరులు పాల్గొన్నారు.


