జిన్నారం (పటాన్చెరు): బొల్లారం పారిశ్రామికవాడలోని గ్లోకేం రసాయన పరిశ్రమలో బుధవారం అగ్ని ప్రమాదం సంభవించింది. ఒక్కసారిగా పరిశ్రమలోని ఓ బ్లాకులో మంటలు అంటుకోవడంతో దట్టమైన పొగ వ్యాపించింది. వెంటనే అప్రమత్తమైన యాజమాన్యం ఫైర్ సిబ్బందికి సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి చేరుకొని గంట వ్యవధిలో మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదంలో పవిత్రో అనే కార్మికుడు తీవ్రంగా గాయపడటంతో గుట్టుచప్పుడు కాకుండా పరిశ్రమ యాజమాన్యం ఆస్పత్రికి తరలించింది. పరిశ్రమలో భద్రతా ప్రమాణాలు పాటించకపోవడమే దీనికి కారణమని కార్మికులు వాపోతున్నారు. ప్రాణనష్టం జరగకపోవడంతో కేవలం ఆస్తి నష్టం అంచనా వేయాల్సి ఉంది. ఘటనపై పోలీసులను వివరణ కోరగా, సమాచారం అందలేదని తెలిపారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
కార్మికుడికి తీవ్ర గాయాలు


