మిరుదొడ్డి(దుబ్బాక): తాళం వేసి ఉన్న ఓ ఇంట్లో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటన అక్బర్పేట–భూంపల్లిల మండల కేంద్రంలో బుధవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన బొమ్మెర శ్రీకర్ ఇంట్లోనే కిరాణాషాపు నిర్వహిస్తూ ఉపాధి పొందుతున్నారు. కుటుంబ సభ్యులు ఇంటికి తాళం వేసి బంధువుల వద్దకు వెళ్ళారు. ఈ క్రమంలో ఇంట్లో ఒక్కసారిగా ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. దట్టమైన పొగ బయటకు రావడంతో గమనించిన స్థానికులు వెంటనే అప్రమత్తమయ్యారు. జేసీబీ సహాయంతో కిరాణాషాపు షట్టర్తోపాటు, తలుపులు పగులగొట్టి మంటలను ఆర్పడానికి ప్రయత్నించారు. మంటలు అదుపులోకి రాకపోవడంతో ఫైర్ సిబ్బంది, పోలీసులకు సమాచారం అందించారు. వారు ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు. అయితే అప్పటికే ఫర్నీచర్, దుస్తులు పూర్తిగా కాలిబూడిదయ్యాయి. తమను ప్రభుత్వం ఆదుకోవాలని బాధితులు కన్నీరుమున్నీరయ్యారు.


