న్యూస్రీల్
సివిల్ సప్లయ్ డీఎం రాజేశ్వర్ మెదక్ డీఆర్ఓగా సీపీఓగా బాధ్యతలు తీసుకున్న సురేందర్ మార్క్ఫెడ్ డీఎం చంద్రశేఖర్కు నెల రోజుల్లోనే ట్రాన్స్ఫర్
జిల్లా అదనపు కలెక్టర్గా సంగీత
అదనపు కలెక్టర్ మాధురి బదిలీ.. ఆమె స్థానంలో సంగీత నియామకం
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి : జిల్లాలో పలు కీలక శాఖల్లో బదిలీలు జరిగాయి. అదనపు కలెక్టర్ (రెవెన్యూ) మూడేళ్లుగా పనిచేస్తోన్న ఆర్.డి.మాధురి నల్లగొండ జిల్లా నీటి పారుదలశాఖ భూసేకరణకు సంబంధించి స్పెషల్ కలెక్టర్గా బదిలీ అయ్యారు. జిల్లా పౌరసరఫరాల సంస్థలో జిల్లా మేనేజర్గా డిప్యూటేషన్పై పనిచేస్తోన్న రెవెన్యూ శాఖకు చెందిన అంబాదాస్ రాజేశ్వర్కు మెదక్ జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్ఓ)గా పోస్టింగ్ ఇచ్చారు. జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు కొనసాగుతున్న తరుణంలో పౌర సరఫరాల సంస్థ డీఎంనూ బదిలీ చేశారు. ఆయన స్థానంలో ఇంకా ఎవరినీ నియమించలేదు. జిల్లా ప్రణాళిక అధికారి (సీపీఓ)గా పనిచేసిన బాలశౌరి ఏప్రిల్ 30న పదవీ విరమణ చేశారు. ఖాళీ అయిన ఈ స్థానంలో ఎన్.సురేందర్ నియమితులయ్యారు. హైదరాబాద్ జిల్లా సీపీఓగా పనిచేస్తున్న సురేందర్కు సంగారెడ్డి సీపీఓగా పూర్తి అదనపు బాధ్యతలు (ఎఫ్ఏసీ) అప్పగించారు. ప్రతిష్టాత్మక జనగణన ప్రక్రియ కొనసాగుతున్న తరుణంలో ఈ సీపీఓ పోస్టు ఎంతో కీలకం. మార్క్ఫెడ్ జిల్లా మేనేజర్ చంద్రశేఖర్గౌడ్కు కూడా స్థాన చలనం కలిగింది. జొన్నలు, శనగలు, మక్కలు వంటి రైతుల ఉత్పత్తులను కొనుగోలు చేసే ఈ సంస్థ జిల్లా మేనేజర్గా చంద్రశేఖర్ నెలరోజుల క్రితమే జిల్లాకు వచ్చారు. ఇంతలోనే ఆయనకు బదిలీ కావడం చర్చనీయాంశంగా మారింది. ఆయన స్థానంలో వరంగల్ జిల్లా డీఎంగా పనిచేస్తున్న రంజిత్రెడ్డి నియమితులయ్యారు. ఇక్కడ పనిచేసిన చంద్రశేఖర్ను వరంగల్ జిల్లాకు..వరంగల్లో పనిచేస్తున్న రంజిత్రెడ్డిని సంగారెడ్డి జిల్లాకు బదిలీ చేయడం గమనార్హం. నెల రోజుల్లోనే ఈ బదిలీ కావడం వెనుక కారణాలపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు చాలారోజులుగా ఖాళీగా ఉన్న జిల్లా పంచాయతీ అధికారి (డీపీఓ) పోస్టు ఎట్టకేలకు ఇటీవలే భర్తీ అయిన విషయం విదితమే. వికారాబాద్ జిల్లాలో పనిచేస్తోన్న మల్లారెడ్డిని సంగారెడ్డి డీపీఓగా బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఆయన ఇటీవలే బాధ్యతలు తీసుకున్న సంగతి తెలిసిందే. డీపీఓగా పనిచేసిన సాయిబాబాపై సస్పెన్షన్ వేటు పడిన తర్వాత ఈ పోస్టులో జెడ్పీ సీఈఓ జానకిరెడ్డికి అదనపు బాధ్యతలు అప్పగించారు. ఇప్పుడు రెగ్యులర్ అధికారిగా మల్లారెడ్డి నియమితులయ్యారు. ఇలా పలు కీలక శాఖల్లో జరిగిన మార్పులు, చేర్పులు ఆయా శాఖ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
సంగారెడ్డి జోన్ : జిల్లా అదనపు కలెక్టర్గా సంగీతను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రంగారెడ్డి జిల్లా డీఆర్ఓగా విధులు నిర్వహిస్తున్న సంగీత పదోన్నతిపై జిల్లాకు బదిలీ అయ్యారు.


