● మంత్రి దామోదర రాజనర్సింహ ● స్మార్ట్ఫోన్లు, స్కూటీల పంపిణీ
జోగిపేట(అందోల్): జిల్లాలో ఖాళీగా ఉన్న అంగన్వాడీ ఆయా, టీచర్ల పోస్టులను భర్తీ చేస్తామని మంత్రి దామోదర రాజనర్సింహ ప్రకటించారు. జిల్లా మహిళా, శిశు, దివ్యాంగ, వయో వృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జోగిపేట– ఆందోల్ మున్సిపాలిటీ పరిధిలోని మంగళవారం నిర్వహించిన ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో దామోదర రాజనర్సింహ పాల్గొని మాట్లాడారు. ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, అన్ని వర్గాల ప్రజల సమగ్రాభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. అంగన్వాడీ వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. రాబోయే రోజుల్లో అన్ని అంగన్వాడీ కేంద్రాలకు సొంత భవనాలు నిర్మించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. అంగన్వాడీ టీచర్లు, సూపర్వైజర్లు, ఆయాలు తమ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు. ఎక్కడైనా నిర్లక్ష్యం, బాధ్యతారాహిత్యం కనబడితే ప్రభుత్వం ఉపేక్షించదని స్పష్టం చేశారు.
స్కూటీల పంపిణీ
జిల్లాలో 10 మంది దివ్యాంగులకు ఉచిత స్కూటీలు, 286 మంది అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్లను మంత్రి దామోదర పంపిణీ చేశారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంజయ్య, మున్సిపల్ చైర్మన్ ఎస్.కృష్ణారెడ్డి, వైస్ చైర్మన్ ఎ.చిట్టిబాబు, అదనపు కలెక్టర్ పాండు, జిల్లా మహిళా శిశు సంక్షేమ అధికారి లలిత కుమారి, సీడీపీఓలు, అంగన్వాడీ సూపర్వైజర్లు, మున్సిపల్ కౌన్సిలర్లు, టీచర్లు, దివ్యాంగులు ఇతరులు పాల్గొన్నారు.


