
సర్కార్ కాలేజీల్లో ఎంట్రన్స్ కోచింగ్
నారాయణఖేడ్: కేవలం ఆర్థికంగా ఉన్న వారి పిల్లలు కార్పొరేట్ కళాశాలల్లో చదువుతున్న వారు..కోచింగ్ కేంద్రాలకు వెళ్లి నేర్చుకునే స్థోమత ఉన్న విద్యార్థులకే అందుబాటులో ఉంటున్న జేఈఈ మెయిన్స్, జేఈ అడ్వాన్స్, నీట్, ఎంసెట్, లా కోర్సు శిక్షణ ప్రభుత్వం తీసుకున్న చర్యలతో సర్కారు కళాశాలల్లో చదివే పేద పిల్లలకు కూడా ఉచితంగా అందనుంది. ఈ విద్యా సంవత్సరం నుంచే సర్కారు కళాశాలల విద్యార్థులకు ఉచిత శిక్షణను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఫిజిక్స్వాలా, ఖాన్ అకాడమీతో ఎంఓయూ చేసుకున్న ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోని ఇంటర్ విద్యార్థులకు పైకోర్సుల ఉచిత శిక్షణను ఆన్లైన్ ద్వారా అందజేస్తోంది. ఈనెల 15 నుంచి ప్రారంభమైన ఈ శిక్షణ డిసెంబర్ 31వరకు కొనసాగనుంది. వారం క్రితం ట్రయల్గా ప్రారంభమైన శిక్షణ మరోవారం తర్వాత పూర్తిస్థాయిలో అన్ని కళాశాలల్లోనూ అందుబాటులోకి రానుంది.
నిత్యం రెండు పీరియడ్స్..
విద్యార్థులకు రోజు రెండు పీరియడ్స్ చొప్పున శిక్షణ ఇస్తారు. ఆన్లైన్ శిక్షణకుగాను కళాశాలల్లో డిజిటల్ స్క్రీన్స్ను ఏర్పాటు చేశారు. ఉదయం 9.30 నుంచి 11వరకు, మధ్యాహ్నం 12.10 నుంచి 2గంటల వరకు, సాయంత్రం 2.55 నుంచి 4.10గంటల వరకు క్లాసులు ఉంటాయి. ఆయా కశాలల్లో రెగ్యూలర్ తరగతుల క్లాసులకు ఇబ్బందులు కాకుండా పై మూడు సమయాల్లో ఏ సమయంలో అనుకూలత ఉంటే ఆ సమయంలో విద్యార్థులు డిజిటల్ క్లాసులను వినవచ్చు.
ఇంటర్పై ప్రత్యేక శ్రద్ధ
ఉమ్మడి మెదక్ జిల్లాలో సంగారెడ్డిలో 20 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, మెదక్లో 17, సిద్దిపేట జిల్లాలో 20 కళాశాలలు ఉన్నాయి. మొదటి, రెండవ సంవత్సరంలో కలిసి సంగారెడ్డిలో 8వేలు, సిద్దిపేటలో 8వేలు, మెదక్లో 3,500ల మంది విద్యార్థులు చదువుతున్నారు. కాగా, ప్రభుత్వం ఇంటర్ విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపుతుంది. ఇంటర్ సైన్స్ గ్రూపులోని ఎంపీసీ విద్యార్థులకు జేఈఈ మేయిన్స్, జేఈ అడ్వాన్ప్, బైపీసీ గ్రూపు విద్యార్థులకు నీట్, ఎంసెట్, ఆర్ట్స్ గ్రూపులైన హెచ్ఈసీ, సీఈసీ విద్యార్థులకు లా (క్లాట్) అడ్మిషన్స్ టెస్ట్కు అవసరమైన ఆన్లైన్ శిక్షణ ఇస్తారు.
అన్ని కళాశాలల్లో నిర్వహిస్తున్నాం
జిల్లాలోని అన్ని కళాశాలల్లో జేఈఈ మెయిన్స్, జేఈ అడ్వాన్స్, నీట్, ఎంసెట్, లా కోర్సు శిక్షణను విద్యార్థులకు అందజేస్తున్నాం. ఆన్లైన్ ద్వారా తరగతులు నిర్వహిస్తున్నాం. విద్యార్థులకు ఇదో మంచి సదవకాశం.
–గోవిందరాం,
జిల్లా ఇంటర్మీడియెట్ అధికారి, సంగారెడ్డి
విద్యార్థులకు మంచి సదుపాయం
ఇంటర్ విద్యార్థులకు జేఈఈ మెయిన్స్, జేఈ అడ్వాన్స్, నీట్, ఎంసెట్, లా (క్లాట్) కోర్సు శిక్షణను అందజేయడం మంచి సదుపాయం. కార్పొరేట్ కళాశాలల్లో ఉన్న సదుపాయం నేడు ప్రభుత్వ కళాశాలల్లో విద్యార్థులకు ప్రభుత్వం ఉచితంగా అందజేస్తుంది.
– కళింగ కృష్ణకుమార్, ప్రిన్సిపాల్, జిన్నారం
ప్రభుత్వ చర్యలతో
పేద విద్యార్థులకు మేలు
ఈ విద్యా సంవత్సరం నుంచే అమలు
సైన్స్ విద్యార్థులకు జేఈఈ మెయిన్స్, అడ్వాన్స్, నీట్, ఎంసెట్
ఆర్ట్స్ గ్రూపు విద్యార్థులకు లా (క్లాట్)
ఫిజిక్స్వాలా, ఖాన్ అకాడమీతో
ఎంఓయూ
జిల్లాలో కళాశాలలు..
జిల్లా కళాశాలలు విద్యార్థులు
సంగారెడ్డి 20 8,000
మెదక్ 17 3,500
సిద్దిపేట 20 8,000