RRR Movie: ఆర్ఆర్ఆర్ కంప్లీట్ పిక్చర్‌..

RRR Movie Announcement To Release Special Story - Sakshi

RRR.... ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ సినిమా సందడే కనిపిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రేక్షకులంతా ఆర్ఆర్ఆర్ కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ మల్టీస్టారర్ గా ఈ చిత్రం తెరకెక్కనుండటంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. కొవిడ్ కష్టాలను ఎదుర్కొంటూ నాలుగేళ్లపాటు శ్రమించి సుమారు 500 కోట్ల రూపాయల బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించారు. మార్చి25న 5 భాషల్లో బాక్సాఫీసు ముందుకు రాబోతున్న ఆర్ఆర్ఆర్.... గత రికార్డులను తొక్కుకుంటూ పోయేందుకు సిద్ధమైంది. 

ఆర్ఆర్ఆర్... రౌద్రం... రణం.. రుధిరం. దర్శక దిగ్గజం రాజమౌళి మేధస్సుకు, సృజనాత్మకతకు అద్దంపట్టే చారిత్రక నేపథ్యమున్న భారీ స్థాయి చిత్రం. బాహుబలి తర్వాత రాజమౌళి ఎలాంటి కథతో వస్తాడోనని ఊహించిన ప్రేక్షకుల అంచనాలను తలకిందులు చేస్తూ ఈ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. 2017 నవంబర్ 18న చరణ్, తారక్ లతో దిగిన ఫొటోను ట్విట్టర్ లో పంచుకొని ఊహించని విధంగా ఆశ్చర్యపరిచారు. వాళ్లద్దరితో మన్యం వీరులు అల్లూరి సీతరామరాజు, కొమురంభీమ్ ల జీవిత నేపథ్యాన్ని ఎంచుకొని సినిమా చేస్తున్నట్లు ప్రకటించారు. ఇక అంతే... యావత్ మరోసారి భారతీయ చిత్ర పరిశ్రమ రాజమౌళి వైపు చూసింది. 

తారక్, చరణ్ లతో మల్టీస్టారర్ సినిమా అనగానే టాలీవుడ్ సైతం ఆశ్చర్యపోయింది. ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య ఈ చిత్రానికి పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చారు. అనుకున్నట్లుగానే కథ మొత్తం సిద్ధం చేసుకున్న రాజమౌళి.... RRR హ్యాష్ ట్యాగ్ తోనే సినిమాను మొదలుపెట్టారు. 2018 నవంబర్ 11న హైదరాబాద్ లోని అల్యుమినియం ఫ్యాక్టరీలో మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా RRR ను లాంఛనంగా ప్రారంభించారు. దర్శకేంద్రుడు రాఘవేందర్ రావు సహా ప్రముఖులంతా హాజరయ్యారు. 2018 నవంబర్ 19న యాక్షన్ సన్నివేశంతో షూటింగ్ ఆరంభించారు. అల్యుమిలియం ఫ్యాక్టరీ, రామోజీఫిల్మ్ సిటీ, వికారాబాద్ ప్రాంతాల్లో ఏకధాటిగా షూటింగ్ జరిపారు. ఆ తర్వాత గుజరాత్, పుణె, మహాభలేశ్వరం, ఉక్రెయిన్ లోనూ ఆర్ఆర్ఆర్ సినిమాను చిత్రీకరించారు. 

 ఇద్దరు స్టార్ హీరోలతో సినిమా చేస్తున్నప్పుడు అదే స్థాయిలో పేరు ఉండాలని భావించారు. మొదట్లో RRR వర్కింగ్ టైటిల్ తో సినిమాను మొదలుపెట్టారు. ప్రేక్షకులంతా అదే టైటిల్ గా భావించారు. కానీ 2019 మార్చి 18న తమ చిత్రానికి RRR అర్థం వచ్చేలా టైటిల్ పెట్టాలంటూ చిత్ర బృందం ప్రేక్షకులను కోరింది. ప్రేక్షకుల నుంచి అనూహ్య స్పందన లభించింది. రకరకాల టైటిల్స్ పోటెత్తాయి. చివరకు అందులో నుంచి "రౌద్రం రణం రుధిరం" పేరుతో మార్చి 25న టైటిల్ ప్రకటిస్తూ రాజమౌళి మోషన్ పోస్టర్ విడుదల చేశారు. అనూహ్యంగా రెండేళ్ల తర్వాత అదే మార్చి 25న సినిమా విడుదల అవుతుండటం విశేషం. 

రాజమౌళి ఏ సినిమా చేసినా ప్రేక్షకులు సంతృప్తి పడే వరకు తీయడం అలవాటు. అందువల్లే బాహుబలి కోసం ఐదేళ్లు పట్టింది. అయితే ఆర్ఆర్ఆర్ విషయంలోనూ కోవిడ్ కారణంగా సినిమా ఆలస్యమైంది. 2018లో మొదలైన సినిమా పూర్తి కావడానికి నాలుగేళ్లు పట్టింది. 200 కోట్ల రూపాయల బడ్జెట్ తో పూర్తవుతుందనుకున్న సినిమా... ఏకంగా 500 కోట్లు దాటింది. నటీనటుల పారితోషకాలు కాకుండానే ఈ స్థాయిలో బడ్జెట్ కావడం దర్శక నిర్మాతలను కలవరానికి గురిచేసింది. అయినా సినిమాపై నమ్మకంతో ఎక్కడా వెనుకడుగు వేయకుండా ఆర్ఆర్ఆర్ ను అన్ని హంగులతో తీర్చిదిద్దారు. కరోనాతో దొరికిన సమయాన్ని సద్వినియోగం చేసుకొని ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచేలా 3డీతోపాటు ఐమ్యాక్స్, డాల్బీ విజన్ ఫార్మట్లలో ను ఆర్ఆర్ఆర్ ను ప్రపంచ వ్యాప్తంగా 5 భాషల్లో విడుదల చేస్తున్నారు. 

ఆర్ఆర్ఆర్ విడుదల తేదీలు ప్రేక్షకులను కొంత అసంతృప్తికి గురిచేశాయి. రెండేళ్లలో సినిమాను పూర్తి చేసి  2020 జులై 20న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని భావించారు. చిత్రీకరణ ఆలస్యం కావడంతో విడుదల తేదీని 2021 జనవరి 8కి వాయిదా వేశారు. ఆ తర్వాత కోవిడ్ కల్లోలంతో చిత్రపరిశ్రమ స్తంభించింది. ఎక్కడికక్కడ థియేటర్లు మూతపడ్డాయి. ప్రభుత్వ ఆంక్షలు, ప్రజల్లో నెలకొన్న భయం కారణంగా సినిమాకు నష్టం రాకూడదని ఆర్ఆర్ఆర్ ను 2021 అక్టోబర్ 13కు వాయిదా వేశారు. ఆ తేదీ వరకు కూడా కొవిడ్ సమస్య తగ్గకపోవడంతో 2022 జనవరి 7కు మార్చారు. రాజమౌళితోపాటు రామ్ చరణ్, ఎన్టీఆర్ సహా చిత్ర బృందం... విస్తృతంగా ఆర్ఆర్ఆర్ ప్రచారం నిర్వహించింది. అప్పటికే విడుదలైన టీజర్లు, పాటలు సినిమాపై అంచనాలను భారీగా పెంచాయి. 

సినిమా విడుదల తేదీలు మారుతుండటం, విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్న క్రమంలో ఇంకోసారి మూడో ముప్పు ఎదురైంది. తెలుగుతోపాటు ఉత్తరాధి రాష్ట్రాల్లో కోవిడ్ ఆంక్షలు ఎక్కువయ్యాయి. ఈసారి రెండు తేదీలను పరిశీలనలో పెట్టుకున్న రాజమౌళి... మార్చి 18న లేదా ఏప్రిల్ 28న విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు. కానీ అనూహ్యంగా మరోసారి తమ నిర్ణయాన్ని మార్చుకొని పక్కాగా మార్చి 25నే ఆర్ఆర్ఆర్ ను విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రేక్షకులు కూడా ఏ మాత్రం నిరాశపడకుండా ఆర్ఆర్ఆర్ కోసం ఎదురుచూస్తుండటం మరో విశేషం. 

బాహుబలి తర్వాత అదే స్థాయిలో నిర్మించిన ఈ చిత్రం భావోద్వేగభరితంగా ఉంటుందని రాజమౌళి తెలిపారు. ఇందుకోసం తీర్చిదిద్దిన పాత్రలు... ఆర్ఆర్ఆర్ చిత్ర కథకు ప్రాణం పోశాయనే చెబుతున్నారు. టాలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్ నటీనటుల సంగమంగా ఆర్ఆర్ఆర్ ను మలిచారు. బాలీవుడ్ నుంచి ఆలియాభట్, అజయ్ దేవగన్ తోపాటు హాలీవుడ్ నటీనటులు ఒలివియో మోరీస్, రే స్టీవెన్ సన్, అలిసన్ డూడీ, ఎడ్వర్డ్ సోనెన్ బ్లిక్ లు సందడి చేయబోతున్నారు. వీరితోపాటు అరుణ్ సాగర్, శ్రియా శరణ్, ఛత్రపతి శేఖర్, రాజీవ్ కనకాల, సముద్రఖనిలు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. 

ఆర్ఆర్ఆర్... గత చిత్రాల వసూళ్లును దాటుతుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. సినిమాపై ప్రేక్షకుల్లో రెట్టింపు అంచనాలు, టికెట్ ధరలను పెంచుతూ ప్రభుత్వాలు అనుకూలంగా ఉత్తర్వులు జారీ చేయడం ఆర్ఆర్ఆర్ కు బాగా కలిసి వచ్చే అవకాశం ఉంది. అలాగే విదేశాల్లో మార్చి 24నే 1200 థియేటర్లలో ఆర్ఆర్ఆర్ ను ముందస్తు ప్రదర్శిస్తున్నారు.విడుదలకు ముందే 1000 కోట్ల వ్యాపారం చేసిన ఆర్ఆర్ఆర్... విడుదలైన మొదటి మూడు రోజుల్లో బాహుబలి-2 పేరుతో ఉన్న 500 కోట్ల రూపాయల రికార్డును తిరగరాస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. తొలివారంలోనే ఈ సినిమా సుమారు 3వేల కోట్ల రూపాయలు కొల్లగొట్టడం ఖాయమని చెబుతున్నారు. ఇదే జరిగితే ప్రపంచ సినిమా చరిత్రలో తెలుగు సినిమా అగ్రభాగాన నిలుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

-నాగేశ్వరరావు సోమిశెట్టి

Read latest Sakshi Special News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top