గడువిచ్చినా.. ఫలితం అంతంతే! | - | Sakshi
Sakshi News home page

గడువిచ్చినా.. ఫలితం అంతంతే!

Jun 9 2025 7:52 AM | Updated on Jun 9 2025 7:52 AM

గడువి

గడువిచ్చినా.. ఫలితం అంతంతే!

ఇబ్రహీంపట్నం: అక్రమ లే అవుట్‌ ప్లాట్ల క్రమబద్ధీకరణ (ఎల్‌ఆర్‌ఎస్‌)కు 25 శాతం రాయితీతో కూడిన ఫీజు చెల్లింపునకు ప్రభుత్వం మూడు నెలలు గడువు ఇచ్చింది. అయినా ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో ఆశించిన స్థాయిలో ఫలితం రాలేదు. తొలుత మార్చి ఫస్టు నుంచి మే 31 వరకు గడువును మూడుసార్లు(ఈ మధ్యకాలంలో) పొడిగిస్తూ రుసుం చెల్లించేందుకు దరఖాస్తుదారులకు ప్రభుత్వం వెసులుబాటును కల్పించింది. అయినప్పటికీ.. ప్లాట్ల యజమానులనుంచి స్పందన అంతంత మాత్రమే వచ్చింది.

14,100 దరఖాస్తులు

2020 నాటికి దరఖాస్తు చేసుకున్న వారి ప్లాట్ల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఇందులో భాగంగా పురపాలక సంఘం పరిధి నుంచి 14,100 ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తులు వచ్చాయి. రద్దీ అధికంగా ఉంటుందని భావించిన అధికారులు.. మున్సిపల్‌ కార్యాలయంలో నాలుగు కౌంటర్లను ఏర్పాటు చేశారు. కానీ.. కేవలం 4,124 ప్లాట్ల యజమానులు మాత్రమే ఫీజు చెల్లించి, క్రమబద్ధీకరించుకున్నారు.

ఆశించింది రూ.60 కోట్లు

ఎల్‌ఆర్‌ఎస్‌ ఫీజు రూపేణా మున్సిపాలిటీకి రూ.55 నుంచి 60 కోట్ల వరకు ఆదాయం సమకూరుతుందని అధికార యంత్రాంగం ఆశించింది. ప్లాట్ల దారుల నుంచి సరైన స్పందన లేని కారణంగా వారి ఆశలపై నీళ్లు చల్లినట్లయింది. కేవలం 29.25 శాతం ప్లాట్ల యజమానుల చెల్లింపుతో రూ.10.69 కోట్లు మాత్రమే వచ్చాయి. మరో 70 శాతం మంది ముందుకు రాకపోవడం గమనార్హం.

మరోసారి..

మొదట్లో సాంకేతిక, అవగాహన లోపంతో ఎల్‌ఆర్‌ఎస్‌ ప్రక్రియలో కొంత జాప్యం జరిగింది. వీటన్నంటిని దృష్టిలో పెట్టుకొని మరో మూడు సార్లు ప్రభుత్వం గడువు పెంచింది. మే నెల 31తో ముగిసింది. ఆశించినట్లుగా అర్జీ దారులు ముందుకు రాకపోవడంతో మరోసారి అవకాశం కల్పించేందుకు మరోదఫా గడువును పెంచాలనే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు అధికారవర్గాలు పేర్కొంటున్నాయి. రెండుమూడు రోజుల్లో ఈ ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉందని చెబుతున్నారు. మరో అవకాశం ఇస్తారా లేదా వేచి చూడాల్సిందే!

పొడిగించే అవకాశం

ఎల్‌ఆర్‌ఎస్‌ గడువును పొడిగించే అవకాశం ఉంది. మున్సిపాలిటీలో 30 శాతం ప్లాట్ల దరఖాస్తుదారులు మాత్రమే ఫీజు చెల్లించారు. సుమారు రూ.10.69 కోట్ల ఆదాయం వచ్చింది. పలు కారణాలతో 70శాతం మంది ముందుకు రాలేదు. మళ్లీ అవకాశం ఇస్తే ఆదాయం పెరగవచ్చు.

– రవీంద్రసాగర్‌, మున్సిపల్‌ కమిషనర్‌,

ఇబ్రహీంపట్నం

తరువాత చూద్దాంలే..

ఫీజు అధికంగా ఉందని కొందరు, ఆర్థిక పరిస్థితుల కారణంతో ఇంకొందరు, లేదా ఫీజు ఇప్పుడేందుకు, తరువాత చూద్దాంలే అని మరికొందరు అర్జీ దారులు ముందుకు రాకపోవడంతో ఆదాయం తగ్గడానికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. అప్పుడైతే దరఖాస్తు చేసుకున్నాం. నిర్మాణ సమయంలో ఫీజు చెల్లిద్దామని, ప్రభుత్వం ఇచ్చే 25 శాతం రాయితీకి ఆశ పడకపోవడం కూడా మరో కారణం కావచ్చు. నాడు దరఖాస్తు చేసుకున్నవారిలో పలువురు ఈ మధ్యకాలంలో ప్లాట్లను విక్రయించుకోవడంతోఆశించిన మేర ఫలితం రాలేదని చెప్పవచ్చు.

మొత్తం 14,100 ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తులు

4,124 అర్జీలు క్లియర్‌

ఆదాయం రూ.10.69 కోట్లు

స్పందించని 70 శాతం మంది

ప్లాట్ల యజమానులు

గడువిచ్చినా.. ఫలితం అంతంతే! 1
1/1

గడువిచ్చినా.. ఫలితం అంతంతే!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement