కరీంనగర్స్పోర్ట్స్: ఉదయం ఐదు గంటలు.. నగరం ఇంకా
నిద్రమత్తులోనే ఉంది. కానీ, కరీంనగర్ అంబేడ్కర్ స్టేడియం మాత్రం హుషారుగా ఉంది. అప్పుడే పలకరిస్తున్న సూర్యకిరణాల సాక్షిగా ఉత్సాహాన్ని నింపు
కుంటుంది. సెల్ఫోన్లకు చిక్కి, టీవీలకు అతుక్కుపోయే ఈ రోజుల్లో మైదానంలో పరుగులు తీస్తున్న చిన్నారుల పాదముద్రలతో జోష్తో ఉంది. కరీంనగర్ మున్సిపల్ ఆధ్వర్యంలో జిల్లా క్రీడాశాఖ, ఒలింపిక్ సంఘం సహకారంతో నిర్వహిస్తున్న ఈ వేసవి క్రీడాశిబిరాలు ఆటలకే పరిమితం కాకుండా, క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసానికి చిరునామాగా నిలుస్తున్నాయి.
ఉత్సాహంగా శిక్షణ.. అండగా పౌష్టికాహారం
శిక్షకుల పర్యవేక్షణలో చిన్నారులు వివిధ క్రీడల్లో తర్పీదు పొందుతున్నారు. నిత్యం ఉదయం 6 నుంచి 9 గంటల వరకు శిక్షణనిస్తున్నారు. ఈనెల 11 నుంచి ప్రారంభమైన శిబిరాలు జూన్ 10 వరకు కొనసాగనున్నాయి. శిక్షణకు తోడు నగరపాలక సంస్థ ప్రతిరోజూ పాలు, గుడ్లు, అరటిపండ్లు అందిస్తోంది. ఆటలు ఆడుతూ, బలమైన ఆహారం తీసుకుంటూ పిల్లలు ఎదుగుతున్నారు. మైదానం చిన్నారుల కేరింతలు, కోచ్ల విజిల్ శబ్దాలతో ఉత్సాహంగా మారిపోతుంది.
16 క్రీడలు.. 900 మంది చిన్నారులు
బల్దియా నిర్వహిస్తున్న ఉచిత వేసవి శిబిరాలలో నేటికి 900 మంది వరకు క్రీడాకారులు సద్వినియోగం చేసుకున్నారు. ఇప్పటికీ ప్రతీ రోజు కొత్తగా 20కి పైగా దరఖాస్తులు వస్తున్నాయని డీవైఎస్వో శ్రీనివాస్ తెలిపారు. 16 క్రీడల్లో ఆర్చరీ, అథ్లెటిక్స్, బాస్కెట్బాల్, క్రికెట్, చెస్, ఫుట్బాల్, హ్యాండ్బాల్, హాకీ, బాక్సింగ్, ఖోఖో, కబడ్డీ, కరాటే, సాఫ్ట్బాల్, వాలీబాల్, యోగా, జూడోలలో శిక్షణ ఇస్తున్నారు.
అంబేడ్కర్ స్టేడియంలో శిబిరాలు
ఆసక్తి చూపుతున్న విద్యార్థులు
సందడిగా క్యాంపులు


