
జాడ లేని లక్ష్మిత్.. పోలీసుల ముమ్మర గాలింపు
కంభం:
అదృశ్యమైన బాలుడి ఆచూకీ లభ్యం కాకపోవడంతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోగా.. పోలీసులు గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. కంభం మండలంలోని లింగోజిపల్లి గ్రామంలో మంగళవారం ఉదయం అంగన్వాడీ కేంద్రం నుంచి బయటకు వచ్చిన మూడేళ్ల బాలుడు పొదిలి లక్ష్మిత్ అదృశ్యమైన సంగతి తెలిసిందే. తొలిరోజు మార్కాపురం డీఎస్పీ నాగరాజు, సీఐ కె.మల్లికార్జున , ఎస్సై నరసింహారావు తమ సిబ్బందితో కలిసి డ్రోన్ కెమెరాలతో గ్రామ పరిసరాలను జల్లెడ పట్టినా ఆచూకీ లభించలేదు. బుధవారం గ్రామ సమీపంలోని పంట పొలాల్లో నల్లవాగు వద్ద బాలుడి చెప్పులను పోలీసులు గుర్తించారు. విషయం తెలుసుకున్న బాలుడి కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్తులు భారీగా నల్లవాగు వద్దకు చేరుకుని వెదికినా ఫలితం లేకుండా పోయింది.
ఆగంతకులు ఎత్తుకెళ్లారా?
బాలుడి చెప్పులు వాగు వద్ద గుర్తించిన పోలీసులు ఒంగోలు నుంచి డాగ్ స్క్వాడ్, క్లూస్ టీమ్ను రప్పించారు. తొలుత పోలీస్ జాగిలం సంఘటనా స్థలం నుంచి నేరుగా గ్రామంలోని అంగన్వాడీ కేంద్రం వద్దకు వెళ్లి ఆగింది. రెండోసారి సంఘటనా స్థలం నుంచి నేరుగా సూరేపల్లి సమీపంలో కంభం–తర్లుపాడు రోడ్డుపైకి వచ్చి ఆగింది. సంఘటనా స్థలంలో క్లూస్ టీమ్ బృందం వేలిముద్రలు సేకరించింది. పోలీస్ జాగిలం వెళ్లిన మార్గాన్ని బట్టి చూస్తే ఆగంతకులు బాలుడిని తీసుకుని నల్లవాగు వెంబడి సూరేపల్లి వద్ద రోడ్డుపైకి చేరుకుని వాహనంలో వెళ్లిపోయి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. బాలుడిని తీసుకెళ్తున్న క్రమంలో వాగు వద్ద చెప్పులు జారి పడినట్లు తెలుస్తోంది.
గాలింపు చర్యల్లో 5 బృందాలు
బాలుడి అదృశ్యం కేసును చాలెంజ్గా తీసుకున్న పోలీసులు మార్కాపురం డీఎస్పీ నాగరాజు పర్యవేక్షణలో సీఐ కె.మల్లికార్జున ఆధ్వర్యంలో 5 బృందాలుగా ఏర్పడి కంభం, మార్కాపురం, తర్లుపాడు, గిద్దలూరు, పొదిలి బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలో గాలిస్తున్నారు. కొందరు కొత్త వ్యక్తులు చెత్త ఏరుకునేందుకు గ్రామంలోకి వచ్చారని గ్రామస్తులు చెబుతున్న నేపథ్యంలో ఆ కోణంలోనూ విచారిస్తున్నారు.
రంగంలోకి దిగిన డాగ్ స్క్వాడ్, క్లూస్ టీమ్
5 ప్రత్యేక బృందాలుగా ఏర్పడి గాలిస్తున్న
పోలీసులు
పంట పొలాల్లో నల్లవాగు సమీపంలో
బాలుడి చెప్పులు లభ్యం
కన్నీరుమున్నీరుగా విలపిస్తున్న కుటుంబ సభ్యులు
గొట్లగట్టులో విషాద ఛాయలు
కొనకనమిట్ల: లక్ష్మిత్ అదృశ్యం కావడంతో స్వగ్రామం కొనకనమిట్ల మండలం గొట్లగట్టులో విషాద ఛాయలు నెలకొన్నాయి. బాలుడి తండ్రి పొదిలి శ్రీను ఉద్యోగ రీత్యా హైదరాబాద్లో ఉండగా, ఇటీవల వరకు లక్ష్మిత్ తన తల్లి సురేఖ, నానమ్మ తులశమ్మతో కలిసి గొట్లగట్టులో ఉన్నాడు. కొద్ది రోజుల క్రితం లక్ష్మిత్ అమ్మమ్మ స్వగ్రామమైన కంభం మండలం లింగోజిపల్లికి వెళ్లాడు. ఎంతో చలాకీగా ఉండే లక్ష్మిత్ అదృశ్యం కావడంపై బంధువులతో పాటు గ్రామస్తులు విచారం వ్యక్తం చేశారు. లక్ష్మిత్ క్షేమంగా తిరిగి రావాలని కోరుకుంటున్నారు. ఇదిలా ఉండగా లక్ష్మిత్ అదృశ్యమైన ఘటన గ్రామాల్లో చిన్న పిల్లలు ఉన్న తల్లిదండ్రులను ఆందోళనకు గురిచేస్తోంది.

జాడ లేని లక్ష్మిత్.. పోలీసుల ముమ్మర గాలింపు

జాడ లేని లక్ష్మిత్.. పోలీసుల ముమ్మర గాలింపు

జాడ లేని లక్ష్మిత్.. పోలీసుల ముమ్మర గాలింపు

జాడ లేని లక్ష్మిత్.. పోలీసుల ముమ్మర గాలింపు