కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి దాకా గులాబీ గుబాళింపు

TRS To Win Six Electoral Seats In Legislative Council Local Bodies Quota - Sakshi

‘మండలి’ స్థానిక సంస్థల ఓటర్ల కోసం టీఆర్‌ఎస్‌ శిబిరాలు 

ఈ నెల 8 నాటికి హైదరాబాద్‌కు చేరుకునేలా ఏర్పాట్లు 

8, 9 తేదీల్లో ఓటింగ్‌పై కేటీఆర్‌ అవగాహన 

10న నేరుగా పోలింగ్‌ కేంద్రాలకు తరలించేలా ఏర్పాట్లు 

సాక్షి, హైదరాబాద్‌: శాసనమండలి స్థానిక సంస్థల కోటాలో ఎన్నికలు జరిగే ఆరు స్థానాలను గెలుచుకునేందుకు టీఆర్‌ఎస్‌ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఓటర్లను ఇప్పటికే వివిధ రాష్ట్రాల్లోని ప్రత్యేక శిబిరాలకు తరలించింది. ఐదు ఉమ్మడి జిల్లాల పరిధిలోని ఆరు స్థానాలకు సంబంధించి నల్లగొండ, ఆదిలాబాద్‌ మినహా మిగతా ఓటర్లందరూ మూడు రోజుల కిందటే క్యాంపులకు వెళ్లారు. ఆదిలాబాద్, నల్లగొండ స్థానాల ఓటర్లను ఈ నెల 6 నుంచి హైదరాబాద్‌ శివార్లలోని క్యాంపులకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

అన్ని స్థానాలకు చెందిన ఓటర్లు ఈ నెల 8 ఉదయానికి హైదరాబాద్‌ శివార్లలో జిల్లాల వారీగా ఏర్పాటు చేసే క్యాంపులకు చేరుకుంటారు. సంబంధిత జిల్లా మంత్రులతోపాటు పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఈ నెల 8, 9 తేదీల్లో వారికి ఓటింగ్‌పై అవగాహన కల్పిస్తారు. 9న వారు బస చేసిన శిబిరాల్లోనే మాక్‌ పోలింగ్‌ నిర్వహించి, పోలింగ్‌ జరిగే 10వ తేదీన పోలింగ్‌ స్టేషన్లకు ప్రత్యేక బస్సుల్లో తరలిస్తారు.

ఆయా జిల్లాల ఓటర్ల కోసం ఢిల్లీ, యూపీ, రాజస్తాన్, కర్ణాటక, గోవా తదితర రాష్ట్రాల్లో శిబిరాలు ఏర్పాటు చేసి సమీపంలోని పర్యాటక, దర్శనీయ ప్రాంతాలకు తీసుకెళ్తున్నారు. దీంతో కన్యాకుమారి నుంచి కశ్మీర్‌ వరకు తెలంగాణకు చెందిన మండలి స్థానిక సంస్థల కోటా ఓటర్ల సందడి కనిపిస్తోంది. విందు, వినోదాలతోపాటు పర్యాటక ప్రాంతాల్లో దిగిన ఫొటోలను వారు సామాజిక మాధ్యమాల్లో షేర్‌ చేస్తుండటంపై చర్చ జరుగుతోంది. 

ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో స్థానిక కోటాలో రెండు స్థానాలున్నాయి. ఇక్కడి ఓటర్లను రెండు బృందాలుగా విభజించి కొందరిని మైసూరు, మరికొందరిని బెంగళూరులోని శిబిరాలకు తరలించారు. మంత్రి గంగుల కమలాకర్‌ బెంగళూరులో మకాం వేయగా, మరో మంత్రి కొప్పుల ఈశ్వర్‌ రెండు రోజులు శిబిరంలో ఉండి హైదరాబాద్‌కు తిరిగివచ్చారు. ఓటర్లను ఈ నెల 6న తమిళనాడు మీదుగా తిరుపతికి తీసుకొచ్చి దైవదర్శనం తర్వాత ఏడో తేదీ రాత్రికల్లా హైదరాబాద్‌కు తరలిస్తారు. శామీర్‌పేటలో ఓ ప్రైవేటు రిసార్టులో వీరికి ఇప్పటికే బస ఏర్పాట్లు చేశారు. టీఆర్‌ఎస్‌ అభ్యర్థులుగా ఎల్‌.రమణ, భానుప్రసాద్‌ పోటీ చేస్తుండగా, ఇటీవలే పార్టీకి రాజీనామా చేసిన రవీందర్‌ సింగ్‌ స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉన్నారు.  

ఉమ్మడి మెదక్‌ జిల్లాకు చెందిన స్థానిక కోటా ఓటర్లకు ఢిల్లీలో క్యాంపు పెట్టారు. ఎంపీలు బీబీ పాటిల్, కొత్త ప్రభాకర్‌రెడ్డి ఏర్పాట్లను పర్యవేక్షిస్తుండగా, సంబంధిత నియోజకవర్గ ఎమ్మెల్యేలు కూడా ఓటర్ల వెంట ఉన్నారు. ఓటర్లను రెండుగా విభజించి ఢిల్లీ, కశ్మీర్‌లకు పంపారు. కొందరు ఢిల్లీ పర్యటన పూర్తి చేసుకుని జైపూర్, ఆగ్రా వంటి ప్రాంతాల సందర్శనకు వెళ్లారు. వీరంతా ఈ నెల 7వ తేదీ హైదరాబాద్‌లోని ఓ రిసార్టుకు చేరుకుంటారు. ఇక్కడ టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా యాదవరెడ్డి పోటీ చేస్తుండగా, కాంగ్రెస్‌ నుంచి ఎమ్మెల్యే జగ్గారెడ్డి భార్య నిర్మల పోటీలో ఉన్నారు. శిబిరం నిర్వహణను మంత్రి హరీశ్‌రావు హైదరాబాద్‌ నుంచే పర్యవేక్షిస్తున్నారు. 

ఖమ్మం జిల్లాకు సంబంధించిన టీఆర్‌ఎస్‌ ఓటర్లు మంత్రి పువ్వాడ అజయ్‌ నేతృత్వంలో గోవాకు వెళ్లారు. వారిని ఈ నెల 8నాటికల్లా హైదరాబాద్‌ శిబిరానికి తరలించేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. 

నల్లగొండకు సంబంధించి స్వతంత్ర అభ్యర్థులు బరిలో ఉండటంతో టీఆర్‌ఎస్‌ ఎలాంటి శిబిరాలు ప్రారంభించలేదు. మంత్రి జగదీశ్‌రెడ్డితోపాటు పార్టీ అభ్యర్థి ఎంసీ కోటిరెడ్డి మండ లి స్థానిక సంస్థల కోటా ఓటర్లుగా ఉన్న ఎంపీటీసీ, జడ్పీటీసీ సభ్యులు, మున్సిపల్‌ కౌన్సిలర్లతో సమావేశమవుతున్నారు. అయితే ఈ నెల 6న ఓటర్లను బృందాలుగా విభజించి కాళేశ్వ రం ప్రాజెక్టుతోపాటు సిద్దిపేట శివారులోని రం గనాయక్‌ సాగర్‌ పర్యటనకు తీసుకెళ్తున్నారు. అక్కడ నుంచి హైదరాబాద్‌ హయత్‌నగర్‌ శివారులో ఏర్పాటుచేసే శిబిరానికి తరలిస్తారు. 

ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాకు సంబంధించిన ఆదిలాబాద్, నిర్మల్‌ ప్రాంతాలకు చెందిన ఓటర్లు శనివారం హైదరాబాద్‌ శివారులోని శిబిరానికి తరలివెళ్లగా, ఆసిఫాబాద్, మంచిర్యాల ఓటర్లు సోమవారం బయలుదేరేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. పార్టీ అభ్యర్థి దండె విఠల్‌ మండలాల వారీగా సమావేశాలు ఏర్పాటు చేస్తూ ఓటర్ల మద్దతు కూడగట్టుకునే ప్రయత్నాల్లో ఉన్నారు.   

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top