ఉద్యమ ఆశయాలకు కేసీఆర్ తిలోదకాలు
వైఎస్ షర్మిల ధ్వజం
తెలంగాణ వచ్చినా అవే ఆత్మహత్యలు, ఆర్తనాదాలు
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక తెలంగాణ ఉద్యమ ద్రోహులను అందలం ఎక్కించి, నిరంకుశ పాలన సాగిస్తున్నారని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యమ ఆశయాలను పూర్తిగా విస్మరించారని విమర్శించారు. ఆత్మ గౌరవ తెలంగాణలోనే బతుకులు బాగుపడతాయని శ్రీకాంతాచారి తనను అగ్నికి ఆహుతి చేసుకున్నారని గుర్తుచేశారు. కానీ తెలంగాణ వచ్చాక కూడా అవే ఆత్మహత్యలు, అవే ఆర్తనాదాలు కొనసాగుతున్నాయని షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు.
కేసీఆర్ నిరంకుశ పాలన భరించలేక రైతులు, నిరుద్యోగులు ప్రాణాలు వదులుతూనే ఉన్నారని చెప్పారు. శ్రీకాంతాచారి వర్థంతి పురస్కరించుకుని శుక్రవారం ట్విటర్ వేదికగా షర్మిల నివాళులర్పించారు. ఆత్మహత్యలు లేని తెలంగాణే శ్రీకాంతాచారికి నిజమైన నివాళి అని పేర్కొన్నారు. శ్రీకాంతాచారి ఆశయ సాధనకు వైఎస్సార్ టీపీ పోరాడుతూనే ఉంటుందని చెప్పారు. నిరుద్యోగులు, సామాన్యుడి నెత్తిన కేసీఆర్ ప్రభుత్వం చార్జీల మోత మోగిస్తోందని మండిపడ్డారు.