కేంద్రం నిధులతో చంద్రబాబు సర్కారు సోకులు చేసింది
గత ప్రభుత్వ తీరుపై సోము వీర్రాజు ఫైర్
నక్కపల్లి/పాయకరావుపేట/సాక్షి, అమరావతి: గతంలో కేంద్ర ప్రభుత్వం పోర్టులు నిర్మించాలని నిధులు విడుదల చేసినప్పటికీ చంద్రబాబు పనులు చేపట్టలేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు విమర్శించారు. కేంద్రం మంజూరు చేసిన విద్యుత్ సబ్స్టేషన్లలో షిఫ్ట్ ఆపరేటర్ పోస్టులను టీడీపీ నేతలు అమ్ముకున్నారని మండిపడ్డారు. ఆయన శుక్రవారం విశాఖ జిల్లా పాయకరావుపేటలో విలేకరులతో మాట్లాడారు. ఆయనేమన్నారంటే..
► కేంద్రం నిధులతో చంద్రబాబు సర్కారు సోకులు చేసింది.
► టీడీపీ హయాంలో ఒక్క పోర్టు కూడా నిర్మించకపోగా కేంద్రం ఇచ్చిన నిధులను పక్కదారి పట్టించారు.
► వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఒక పోర్టు నిర్మించారు.
► పోర్టులు నిర్మించకపోవడం వల్లే మత్య్సకారులు ఇతర రాష్ట్రాలకు వలస పోతున్నారు.
► రాబోయే రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి సాగర తీరంలో అభివృద్ధి చేయడానికి కృషి చేస్తాం.
► టీడీపీ హయాంలో చంద్రన్న బాట పేరుతో వేసిన రోడ్లు బీజీపీ ప్రభుత్వం మంజూరు చేసినవే.
విద్యా సంస్థలు దశలవారీగా ప్రారంభించాలి
కరోనా నేపథ్యంలో రాష్ట్రంలో విద్యా సంస్థలను పూర్తి భద్రతా చర్యలు తీసుకున్న తర్వాతే, అదీ దశల వారీగా ప్రారంభించాలని సోము వీర్రాజు శుక్రవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు.