కాంగ్రెస్ను నడిపిస్తోంది కేసీఆరే..
కేసీఆర్పై ధర్మపురి, సంజయ్ ఆగ్రహం
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో కాంగ్రెస్ను సీఎం కేసీఆరే నడుపుతున్నారని, రాబోయే రోజుల్లో కాంగ్రెస్ టికెట్లు కూడా ఆయనే ఇస్తారంటూ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఎద్దేవా చేశారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి ఇందిరాపార్క్ వద్ద ధర్నా చేస్తానంటే అనుమతి ఇచ్చిన సీఎం కేసీఆర్ బీజేపీకి ఎందుకు ఇవ్వట్లేదని ప్రశ్నించారు. దీన్నిబట్టే కాంగ్రెస్ వెనుక ఎవరున్నారో ప్రజలకు అర్థం అవుతోందని పేర్కొన్నారు. గురువారం ఢిల్లీలోని తెలంగాణ భవన్లో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఎంపీ సోయం బాపూరావుతో కలసి మీడియాతో మాట్లాడారు.
శుక్రవారం ఇందిరా పార్కు వద్ద బీజేపీ చేపట్టిన ధర్నా సక్సెస్ కావొద్దనే ఉద్దేశంతో 48 గంటల ముందు నుంచి బీజేపీ కార్యకర్తలను అరెస్టు చేయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్లో సరైన అనుమతు ల్లేవని, అక్రమ నిర్మాణాలని హిందువుల ఇళ్లనే జీహెచ్ఎంసీ టార్గెట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు సంజయ్ పేర్కొన్నారు. హుజురాబాద్లో బీజేపీ గెలుస్తుందని అన్ని సర్వేలు చెబుతుండటంతో ప్రజల దృష్టి మళ్లించడం కోసం కేసీఆర్ కొత్త పథకాలు తీసుకువస్తున్నారని అన్నారు. కాగా, ఈటల బావమరిది పేరిట ఫేస్బుక్, ట్విట్టర్, వాట్సాప్ల్లో ఫేక్ ఐడీ తయారు చేసి అసత్య ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.