పెద్దపల్లిరూరల్: ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అవసర మైన పాఠ్యపుస్తకాలు జిల్లాకు వచ్చిచేరాయి. మొత్తం పాఠశాలలకు 2,18,980 పాఠ్యపుస్తకాలు అవసరం కాగా ఇప్పటివరకు 1,82,190 పుస్తకాలు (83శాతం) వచ్చినట్టు అధికారులు తెలిపారు. గురువారం డీఈవో శారద ధర్మారం, రామగిరి మండలాల్లో పాఠ్యపుస్తకాలు పంపిణీ చేశారు. పెద్దపల్లి మండలం అప్పన్నపేట జెడ్పీ హైస్కూల్లో పుస్తకాలు భద్రపరిచి అక్కడ నుంచే స్కూళ్లకు పంపిణీ చేయనున్నారు.
ఇంకా 7 టైటిల్స్ రాలే..
విద్యార్థులకోసం అవసరమైన పాఠ్యపుస్తకాల్లో ఇంకా ఏడు టైటిల్స్ అందాల్సి ఉందని అధికార వర్గాలు తెలిపాయి. అందులో రెండో తరగతి ఇంగ్లి ష్, ఐదో తరగతి తెలుగు, ఆరో తరగతి హిందీ, ఎనిమిదో తరగతి హిందీ, తొమ్మిదో తరగతి హిందీ, ఇంగ్లిష్ పుస్తకాలు రావాల్సి ఉంది.
నెలాఖరు వరకు అందిస్తాం
జిల్లాకు చేరిన పాఠ్యపుస్తకాల పంపిణీని డీఈవో గురువారం ప్రారంభించారు. దశలవారీగా అన్ని మండలాలకు అందజేస్తాం. ఈనెల 25 వరకు వర్క్బుక్స్తోపాటు మిగిలిన టైటిల్బుక్స్ కూడా అందుతాయి. వాటన్నింటినీ ఈ నెలాఖరులోపే పంపిణీ పూర్తిచేస్తాం.
– సతీశ్, పాఠ్యపుస్తకాల గోదాం ఇన్చార్జి


