శనివారం శ్రీ 18 శ్రీ మార్చి శ్రీ 2023
వాతావరణం
ఆకాశం మేఘావృతమై ఉంటుంది. జిల్లాలో వర్షం కురిసే అవకాశం ఉంది. గాలిలో తేమ అధికంగా ఉంటుంది. రాత్రి వేళ ఈదురుగాలులు వీస్తాయి.
ధర్మపురి: ధర్మపురిలోని గోదావరినదిలో శుక్రవారం భక్తులు పుణ్య స్నానాలు ఆచరించారు. గంగమ్మ, గౌరమ్మకు మొక్కులు చెల్లించి నైవేద్యాలు సమర్పించారు.
వేములవాడ: రాజన్నను శుక్రవారం 10 వేల మంది భక్తులు దర్శించుకున్నారు. తలనీలాలు, నిలువెత్తు బంగారం,
కోడె మొక్కులు చెల్లించుకున్నారు.
గోదావరిఖని: ‘నేర పరిశోధన.. రికార్డుల నిర్వహణ.. టెక్నాలజీ వినియోగం.. ఫ్రెండ్లీ పోలీసింగ్.. లీడర్షిప్.. ఇలా పది సూత్రాల అమలుపై పట్టు బిగించాలి.. క్రైం మ్యాపింగ్, క్రైం ట్రేసింగ్, రికార్డ్ మెయింటనెన్స్, టెక్నాలజీ, మీడియా రిలేషన్పై పట్టుసాధిస్తే సమాజంలో ప్రజలు ప్రశాంతంగా జీవిస్తారని’ రామగుండం పోలీస్ కమిషనర్ రెమా రాజేశ్వరి అన్నారు. రామగుండం పోలీస్ కమిషనర్గా బాధ్యతలు చేపట్టిన అనతికాలంలోనే నేరాల అదుపునకు తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలిస్తున్నాయి. వరుస చోరీలకు పాల్పడి పోలీసుశాఖకు చిక్కకుండా తప్పించుకు తిరుగుతున్న పగటి దొంగను అరెస్ట్ చేసి ఈప్రాంత వాసుల్లో ధైర్యాన్ని నింపారు. ఇంటికి తాళం వేసి ఊరికి వెళ్లాలంటేనే భయపడుతున్న క్రమంలో పగటి దొంగ అరెస్ట్తో రెండు జిల్లాల ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. ఇంటగెలిచి రచ్చగెలవాలనే సంకల్పంతో పోలీస్ కమిషనర్గా బాధ్యతలు చేపట్టిన అనంతరం ముందుగా పోలీస్ శాఖపై దృష్టి సారించారు. కమిషనరేట్ పోలీసు అధికారులకు పది సూత్రాల అమలుపై దిశానిర్దేశం చేస్తున్నారు. పటిష్ట ప్రణాళికతో ముందుకు సాగినప్పుడే నేరాలను సమర్థవంతంగా అరికట్టవచ్చని దీమాగా చెబుతున్నారు. మహిళా పోలీసు అధికారిగా ఉన్న తన వద్దకు చాలా మంది మహిళలు తమకు జరిగిన అన్యాయాన్ని వివరించేందుకు ఎన్నో ఆశలతో వస్తున్నారని తెలిపారు. ఏదిఏమైనా చట్టానికి లోబడి పనిచేయాల్సి ఉంటుందన్నారు. ఈనేపథ్యంలో శుక్రవారం ‘సాక్షి’తో మాట్లాడారు.
● అమలుపై పోలీసు అధికారులకు దిశానిర్దేశం
● నేర పరిశోధన, నేరాల నివారణ, డేటా నిర్వహణ
● టెక్నాలజీ వినియోగం, నిందితుల గుర్తింపు
● ఫ్రెండ్లీ పోలీసింగ్, లీడర్షిప్, క్రమశిక్షణ
● మీడియా రిలేషన్, ప్రజల సహకారం అవసరం
● ‘సాక్షి’ ఇంటర్వ్యూలో రామగుండం పోలీస్ కమిషనర్ రెమా రాజేశ్వరి
అత్యాధునిక టెక్నాలజీ..
మారుతున్న కాలానికి అనుగుణంగా పోలీసు శాఖలో మార్పులు తీసుకవస్తున్నాం. ప్రధానంగా ప్రపంచమే కుగ్రామమై అరచేతిలోకి చేరిన క్రమంలో సైబర్ నేరాలు విపరీతంగా పెరిగిపోయాయి. చాలా మంది అమాయకులు ఆర్థికంగా నష్టపోతున్నారని, టీనేజీ యువత సెల్ఫోన్ ప్రపంచంలో పడి జీవితాలను కోల్పోతున్న ఈక్రమంలో సైబర్నేరాలపై అవగాహన ఉండేందుకు ప్రతీ పోలీసు అధికారి, సిబ్బందికి శిక్షణ ఇప్పించడంపై దృష్టి సారించాం. పోలీస్స్టేషన్ల వారీగా ఎంపిక చేసి సైబర్క్రైంపై శిక్షణ ఇప్పిస్తున్నాం. ఆన్లైన్ ఆర్థిక నేరాలపై సీరియస్గా దృష్టి పెట్టాం. ఎంపిక చేసిన అధికారులు, సిబ్బందిని ఢిల్లీ, బోపాల్, హైదరాబాద్కు పంపించి సైబర్నేరాలపై పట్టుసాధించేందుకు అత్యాధునిక శిక్షణ ఇప్పిస్తున్నాం.
క్రైం మ్యాపింగ్.. ట్రేసింగ్..
తమ పోలీస్స్టేషన్ల పరిధిలో నేరాలు ఎక్కడ ఎక్కువగా జరుగుతాయో గుర్తించి నేరాలపై దృష్టి సారించాలి. గత నేరాలను రికార్డు చేస్తూ మ్యాపింగ్ చేసిన నేరాల నిర్మూలనకు ఎలాంటి చర్యలు తీసుకోవాలో సూచించాలి. అలాగే నేరస్తుల గుర్తింపునకు ప్రాధాన్యం ఇవ్వాలి.
డేటా రికార్డింగ్.. మెయింటనెన్స్
నేరస్తుల డేటా రికార్డులు పొందుపర్చాలి. ఇలా నేరస్తులు, నేరాలు ముందుగానే తెలుసుకుంటే శాంతిభద్రతలు అదుపులో పెట్టవచ్చు. అన్ని పోలీస్స్టేషన్లలో నేరస్తుల వివరాలను గుర్తించి వీటి నిర్వహణ ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలి. దీంతో ఎక్కడైన నేరం జరిగితే పాత నేరస్తులతో పాటు అక్కడ జరిగిన సంఘటన ఆధారంగా నిందితులను తొందరగా గుర్తించే వీలుంటుంది.
స్టేషన్ అధికారికి నాయకత్వ లక్షణాలుండాలి
ప్రతీ పోలీస్స్టేషన్ అధికారి నాయకత్వ లక్షణాలు కలిగి ఉండాలి. ప్రతీ విభాగంపై పట్టు సాధించాలి. స్టేషన్ మేనేజ్మెంట్, డిసిప్లేన్, లాఅండ్ఆర్డర్, పనుల కేటాయింపులో పారదర్శకత కలిగి ఉండాలి. నేరాల అదుపునకు ముందస్తు జాగ్రత్తలు, నేరం జరిగితే వాటిని చేధించడం, నేరస్తులకు శిక్ష పడేలా చూడటం ప్రతీ స్టేషన్ అధికారి బాధ్యత. అలాగే స్వీయ నియంత్రణ పాటించాలి.
వాస్తవాలను మీడియాకు వివరించాలి
ప్రస్తుత సమాజంలో పోలీసు అధికారులు మీడియాను గౌరవించాలి. ప్రతీ కేసులో పారదర్శకత పాటిస్తూ మీడియాకు వాస్తవాలను వివరించాలి. దీని ద్వారా ఊహాగానాలకు పుల్స్టాఫ్ పెట్టవచ్చు. ప్రతీ విషయాన్ని ప్రజలకు తెలియజెప్పాల్సిన బాధ్యత మనపై ఉంది.
సరిహద్దు ప్రాంతాలపై ప్రత్యేక నిఘా
రామగుండం పోలీస్ కమిషనరేట్ సరిహద్దు ప్రాంతాలపై ప్రత్యేక నిఘా పెట్టాం. ఇతర రాష్ట్రాల నుంచి నిషేధిత గంజాయి అక్రమ రవాణా జరగకుండా చెక్పోస్టులు ఏర్పాటు చేశాం. అలాగే మావోయిస్టుల కదలికలపై గట్టి నిఘా పెట్టాం. నిరంతర పర్యవేక్షణ కొనసాగుతోంది. మారుమూల గ్రామాల యువత కోసం జాబ్ మేళాలు నిర్వహిస్తాం. ఉపాధి అవకాశాల కోసం శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తాం.
ప్రజల సహకారంతోనే నేరాల అదుపు
సమాజంలో జరుగుతున్న నేరాల అదుపులో పెట్టేందుకు ప్రజల సహకారం ముఖ్యం. నేరం జరిగిన వెంటనే సమాచారం అందించడంతో పాటు నేరస్తుల విషయంలో కూడా పోలీసు శాఖకు సమాచారం అందిస్తే కేసును తొందరగా చేధించే అవకాశం ఉంటుంది. కీలక సమాచారం అందించే వారి పేర్లను గోప్యంగా ఉంచుతాం. అలాగే సమాజంలో నిత్యం జరుగుతున్న దొంగతనాలు, వాటి నివారణలో అందరి సహకారం అవసరం.
న్యూస్రీల్