పశువైద్యులే లేరు.. ఇక సేవలు ఎలా...!
● సంచార పశు ఆరోగ్య సేవ వాహనాల్లో వైద్యులు లేకుండా నిర్వాహణ
● జిల్లాలో 13 వాహనాలు ● 6 వాహనాల్లో వైద్యులు లేరు
● పారావెట్లతో వైద్యం కానిచ్చేస్తున్నారు..
● మూగజీవాలకు అందని నాణ్యమైన వైద్య సేవలు
విజయనగరం ఫోర్ట్: మూగజీవాలకు నాణ్యమైన వైద్య సేవలు, గ్రామాలకు వెళ్లి సేవలు అందించాలనే ఉద్దేశంతో వైఎస్సార్సీపీ ప్రభుత్వం సంచార పశు ఆరోగ్య సేవ (1962) వాహనాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ట్రోల్ఫ్రీ నంబరు 1962కు ఫోన్ చెయ్యగానే సంబంధిత గ్రామానికి చేరుకునేవారు. వాహనంలో ఉండే పశు వైద్యుడు, పారావెట్, డ్రైవర్లు రైతు పశువులశాల వద్దకు వెళ్లి పశువులకు వైద్యం అందించేవారు. శస్త్రచికిత్స అవసరం అనుకుంటే అదే వాహనం విజయనగరం ఆస్పత్రికి తరలించి శస్త్రచికిత్స నిర్వహించిన తర్వాత తిరిగి రైతు కళ్లానికి అప్పగించేవారు. రైతు వద్దకే సేవలు అందడంతో అప్పట్లో రైతులు ఎంతో సంతోషించారు. కూటమి సర్కార్ వచ్చిన తర్వాత సంచార పశు ఆరోగ్యసేవ వాహనాలను నిర్వీర్యం చేసే విధంగా ప్రయత్నిస్తుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వాహనాల్లో పూర్తి స్థాయి సిబ్బంది, మందులు లేకుండానే వాహనాలను నిర్వహిస్తుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. గతంలో 1962 వాహనాలను జీవీకే ఈఎంఆర్ఐ సంస్థ నిర్వహించేది. కూటమి సర్కార్ వచ్చిన తర్వాత వాటి నిర్వాహణను భవ్య హెల్త్ సర్వీసెస్ సంస్థకు అప్పగించారు.
పశువైద్యులు లేకుండానే వాహనాల
నిర్వాహణ..!
మూగ జీవాలకు వైద్య సేవలు అందించాలంటే పశు వైద్యుడు ఉండాలి. కాని సంచార పశు ఆరోగ్య సేవ వాహనాల్లో పశు వైద్యుడు లేకుండానే వైద్య సేవలు అందిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సగం వాహనాలకు పశు వైద్యులు లేరని తెలుస్తుంది. విజయనగరం మినహా మిగిలిన నియోజకవర్గాలకు రెండు చొప్పన సంచార పశు ఆరోగ్య సేవ వాహనాలను కేటాయించారు. విజయనగరం నియోజకవర్గంలో ఒకటి, గజపతినగరం నియోజకవర్గంలో 2, నెల్లిమర్లలో 2, చీపురుపల్లిలో 2, ఎస్.కోటలో 2, బొబ్బిలిలో 2, రాజాంలో నియోజకవర్గంలో 2 చొప్పున మొత్తం 13 వాహనాలు జిల్లాలో ఉన్నాయి. అయితే ప్రస్తుతం ఆరు వాహనాల్లో పశు వైద్యులు లేరనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. విజయనగరం, ఎస్.కోట, నెల్లిమర్ల, గజపతినగరం, రాజాం నియోజకవర్గంలోని సంతకవిటి, బొబ్బిలి నియోజకవర్గంలోని తెర్లాంలో వాహనాల్లో పశువైద్యులు లేరనే విమర్శలు వినిపిస్తున్నాయి. వైద్యులు లేకుండానే వాహనాలను నిర్వహిస్తున్నట్టు సమాచారం. వైద్యులు లేని వాహనాల్లో పారావెట్లతో పని కానిచ్చేస్తున్నారు. దీని వల్ల పశువులకు నాణ్యమైన వైద్య సేవలు అందడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పశువైద్యుడు ఉంటే నాణ్యమైన వైద్యం అందుతుందని రైతులు పేర్కొంటున్నారు.
వైద్యుల నియామకం చేపట్టని వైనం
పశు వైద్యులు ఖాళీ అయినట్టయితే వెంటనే వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో నియామకం చేపట్టేవారు. కూటమి పాలనలో మూడు నెలలుగా పశు వైద్యులను నియమించకపోవడం పట్ల సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. పశు వైద్యుడికి రూ.45 వేలు జీతం చెల్లిస్తున్నారు. నియామకం చేపట్టకపోతే ఆ డబ్బు తమకు మిగులుతాయని ఉద్దేశంతో నియామకం చేపట్టడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.


