
డీఈఓ కార్యాలయం వద్ద ఎంటీఎస్ టీచర్ల ఆందోళన
గుంటూరు ఎడ్యుకేషన్: గుంటూరు జిల్లా విద్యా శాఖ అధికారి కార్యాలయం వద్ద మంగళవారం సాయంత్రం ప్రభుత్వ పాఠశాలల్లో మినిమమ్ టైమ్ స్కేల్ (ఎంటీఎస్) పద్ధతిపై పనిచేస్తున్న ఉపాధ్యాయులు ఆందోళనకు దిగారు. పల్నాడు జిల్లాలోని దుర్గి, వెల్దుర్తి, బొల్లాపల్లి తదితర మండలాల్లో రెగ్యులర్ టీచర్ల బదిలీ కారణంగా ఖాళీగా ఉన్న పాఠశాలల్లో ఎంటీఎస్ పద్ధతిపై పనిచేస్తున్న టీచర్లను సర్దుబాటు చేసేందుకు మంగళవారం సాయంత్రం డీఈఓ కార్యాలయానికి రావాల్సిందిగా సమాచారం పంపారు. జిల్లావ్యాప్తంగా సుమారు 150 మంది ఎంటీఎస్ టీచర్లకు సమాచారం పంపడంతో సంబంధిత టీచర్లు డీఈఓ కార్యాలయానికి వచ్చి నిరసన వ్యక్తం చేశారు. గతనెలలోనే తమను కౌన్సెలింగ్ ద్వారా వేర్వేరు పాఠశాలలకు పంపారని, మళ్లీ ఇప్పుడు కౌన్సిలింగ్ పేరుతో పల్నాడు జిల్లాలోని మారు మూల మండలాలకు వెళ్లాలని చెప్పడం ఏంటంటూ ఆందోళనకు దిగారు. కాగా, గుంటూరు, పల్నాడు జిల్లాల డీఈఓలు పి.వి.రేణుక, చంద్రకళ ఎంటీఎస్ టీచర్లతో మాట్లాడారు. డీఎస్సీ నియామకాలు జరిగి కొత్త టీచర్లు వచ్చే వరకు పల్నాడు జిల్లాలో విధులు నిర్వహించాలంటూ ఎంటీీఎస్ టీచర్లకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ ఎంటీఎస్ టీచర్ల అంగీకరించలేదు. ఫలితంగా కౌన్సెలింగ్ నిలిచిపోయింది.
లక్ష్యానికి మించి ఉపాధి పనులు
డీఆర్డీఏ పీడీ ఎంఎస్ మూర్తి
యడ్లపాడు: జిల్లాలో ఉపాధి హామీ పనులు లక్ష్యానికి మించి జరుగుతున్నాయని జిల్లా డీఆర్డీఏ పీడీ ఎంఎస్ మూర్తి వెల్లడించారు. మంగళవారం యడ్లపాడు ఎంపీడీఓ కార్యాలయాన్ని సందర్శించిన ఆయన, ఉపాధి హామీ పథకం పనులు ప్రగతి, లక్ష్యాలు, ఇతర విషయాలను అధికారుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం విలేకర్లతో మాట్లాడారు. జిల్లాలో ఈ ఏడాది ఉపాధి పనుల లక్ష్యం 45 లక్షల పనిదినాలు కాగా, ఇప్పటికే 55.13 లక్షల పని దినాలు పూర్తయ్యాయని, ఇది లక్ష్యానికి మించి సాధించిన ప్రగతి అని వివరించారు. గోకుల షెడ్ల పథకానికి సంబంధించి గత ఏడాది మంజూరైన 740 గోకుల షెడ్లలో 63 షెడ్లు బేస్ లెవల్లో ఉన్నాయని, మిగిలినవి వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నాయని తెలిపారు. ఉద్యాన పంటలకు ఉపాధి హామీ పథకం కింద 100శాతం రాయితీని అందిస్తున్నామని ఎంఎస్ మూర్తి తెలిపారు.
జీడీసీఏ జిల్లా అధ్యక్షుడిగా రాకేష్ చౌదరి
గుంటూరు వెస్ట్ (క్రీడలు): గుంటూరు జిల్లా క్రికెట్ అసోసియేషన్(జీడీసీఏ) నూతన అధ్యక్షుడిగా చుక్కపల్లి రాకేష్ చౌదరి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని జీడీసీఏ ఉపాధ్యక్షుడు తోట వెంకట శివ రామకృష్ణ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. సోమవారం నిర్వహించిన ఎన్నికలకు ఎలక్షన్ ఆఫీసర్గా వెంకటరత్నం వ్యవహరించారన్నారు. కార్యదర్శిగా ఎనుముల శ్రీధర్, సంయుక్త కార్యదర్శిగా డాక్టర్ కొంగర రాహుల్ చౌదరి, ఉపాధ్యక్షుడిగా తోట వెంకట శివరామకృష్ణ, కోశాధికారిగా సింగరాజు లక్ష్మీకాంత్, కౌన్సిలర్గా నందిరాజు శివ రామకృష్ణ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారన్నారు.
పల్నాడు జిల్లాలోని పాఠశాలల్లో సర్దుబాటు వద్దంటూ నిరసన

డీఈఓ కార్యాలయం వద్ద ఎంటీఎస్ టీచర్ల ఆందోళన

డీఈఓ కార్యాలయం వద్ద ఎంటీఎస్ టీచర్ల ఆందోళన