
ఏకపక్ష వైఖరికి కత్తెర పడేనా?
ప్రజాప్రతినిధులను పక్కనపెట్టి జెడ్పీ చైర్పర్సన్ ఏకపక్షంగా తీసుకుంటున్న నిర్ణయాలపై సర్వత్రా వ్యతిరేకత
వ్యక్తమవుతోంది. ప్రజావసరాలను గుర్తించి పనులకు సభ్యుల ఆమోదంతో నిధులు కేటాయించాల్సి ఉన్నా అడ్డదారిలో మంజూరు చేయడం కమీషన్ల కోసమేననే ఆరోపణలకు తావిస్తోంది. నేడు జరగబోయే సర్వసభ్య సమావేశంలో దీనిపై వైఎస్సార్సీపీ సభ్యులు మరోమారు నిరసన గళం వినిపించే అవకాశం ఉంది.
గుంటూరు ఎడ్యుకేషన్ : ఉమ్మడి గుంటూరు జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం శుక్రవారం జరగనుంది. ఉదయం 10.30 గంటలకు జెడ్పీ సమావేశ మందిరంలో జరగనున్న ఈ సమావేశానికి ఉమ్మడి గుంటూరు జిల్లా పరిధిలోని ప్రజా ప్రతినిధులు, జెడ్పీటీసీలు, అధికారులకు జెడ్పీ నుంచి ముందస్తుగా సమాచారాన్ని పంపారు. గత మార్చి 15న కోరం లేకపోవడంతో వాయిదా పడిన సమావేశం మరలా ఇప్పటి వరకూ జరగలేదు. 2024–25 ఆర్థిక సంవత్సర సవరణ బడ్జెట్తోపాటు 2025–26 ఆర్థిక సంవత్సర అంచనా బడ్జెట్ను ఆమోదించేందుకు కీలకమైన సర్వసభ్య సమావేశానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన జెడ్పీటీసీలు గైర్హాజరు కావడంతో నిరవధికంగా వాయిదా పడింది.
చైర్పర్సన్ ఏకపక్ష ధోరణిపై వ్యతిరేకత
ప్రజల ఓట్లతో గెలిచిన జెడ్పీటీసీలకు సముచిత గౌరవాన్ని ఇవ్వకపోవడంతోపాటు ముందస్తు అనుమతుల పేరుతోనూ జెడ్పీ చైర్పర్సన్ నేరుగా సంతకాలు చేసి పనులు చేస్తున్న ధోరణికి వ్యతిరేకిస్తూ వైఎస్సార్సీపీ జెడ్పీటీసీలు మార్చి 15న ఏర్పాటు చేసిన బడ్జెట్ సమావేశాన్ని బహిష్కరించారు. జెడ్పీటీసీల ప్రమేయం లేకుండా, సర్వసభ్య సమావేశం దృష్టికి తీసుకురాకుండా పనులు మంజూరు చేస్తున్నప్పుడు ఇక తమకు విలువ ఎక్కడిదని నిలదీశారు. టీడీపీ ఎమ్మెల్యేల సిఫార్సులతో, అత్యవసర పనుల పేరుతో రూ.కోట్ల విలువైన పనులకు ముందస్తు అనుమతులు ఇస్తున్న తీరును ఖండించారు. వాటిలో కమీషన్లు, పర్సంటేజీ తీసుకుని అవినీతి, అక్రమాలతో జెడ్పీని నడుపుతున్నారని ఆరోపణాస్త్రాలు సంధించారు. మార్చిలో ఏర్పాటు చేసిన జెడ్పీ సర్వసభ్య సమావేశంలో ఆర్థిక సంవత్సర బడ్జెట్న ఆమోదించాల్సి ఉండటంతోపాటు రూ.12 కోట్ల విలువైన పనులకు చైర్పర్సన్ కత్తెర హెనీ క్రిస్టినా ముందస్తు అనుమతులను ఇచ్చేయడంతో సమావేశానికి హాజరైన పక్షంలో సభ్యులు అంగీకారం తెలిపినట్లవుతుందనే కోణంలో గైర్హాజరయ్యారు. తద్వారా జెడ్పీటీసీలు తమ హక్కులను పరిరక్షించుకోవడంలో సఫలీకృతమయ్యారు.
జెడ్పీటీసీల అంగీకారం లేకుండా అడ్డగోలుగా పనులు కేటాయింపుపై వ్యతిరేకత
నేడు జెడ్పీ సర్వసభ్య సమావేశం
చైర్పర్సన్ ఏకపక్ష ధోరణిపై వైఎస్సార్ సీపీ సభ్యుల తీవ్ర అసంతృప్తి తాము గెలిచి ప్రయోజనమేంటని ప్రశ్నిస్తున్న జెడ్పీటీసీలు నిరసనగా గతంలో బడ్జెట్ సమావేశానికి గైర్హాజరు ప్రభుత్వానికి పంపి మరీ ఆమోదింపజేసుకున్న చైర్పర్సన్ గతంలో జెడ్పీటీసీలకు తెలియకుండా రూ.12 కోట్ల పనులకు ముందస్తు అనుమతులు తాజాగా మరో రూ.10 కోట్ల మేరకు ఇదే తరహాలో అనుమతి

ఏకపక్ష వైఖరికి కత్తెర పడేనా?