రాయగడ: రాయగడ ప్రజల ఆరాధ్య దైవం స్థానిక భవానీ వీధిలో కొలువై ఉన్న గ్రామ దేవత బురదల పోలమ్మ ఉత్సవాలు జూన్ 1వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో అమ్మవారి ఉత్సవాలు జరిగే వేదిక వద్ద శుక్రవారం ముహూర్తపు రాట కార్యక్రమం జరిగింది. సంప్రదాయబద్ధంగా పూజా కార్యక్రమాలను నిర్వహించారు. తొమ్మిది రోజుల పాటుగా జరిగే ఈ ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు పనులను ప్రారంభిస్తారు. అందుకు ఉత్సవ కమిటీ సన్నద్ధమవుతోంది.
రాయగడ: స్థానిక పయికొ వీధిలో పూజలందుకుంటున్న మా సమలాయి దుర్గా అమ్మవారి వార్షిక ఉత్సవాలు శుక్రవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆమ్మవారి ఉత్సవాల్లో భాగంగా నిర్వాహకులు అమ్మవారి పాదాలను మజ్జిగౌరి అమ్మవారి మందిరం ప్రాంగణంలో గల పాదాల గుడి నుంచి తీసుకువచ్చి అమ్మవారి సన్నిధిలో నిలిపారు. ఈ సందర్భంగా పురవీధుల్లో ఊరేగింపుగా వెళ్లారు. ఐదు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో పూజా కార్యక్రమాలతోపాటు ప్రతీరోజు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలియజేశారు.
అదృశ్యమైన వ్యక్తి మృతదేహం లభ్యం
జి.సిగడాం: ఆనందపురం గ్రామానికి చెందిన పొగిరి సత్యం ఈ నెల 4న అదృశ్యమై శుక్రవారం విగతజీవిగా కనిపించాడు. సత్యం ఈ నెల 4 నుంచి కనిపించడం లేదని కుటుంబ సభ్యులు ఈ నెల 5న ఫిర్యాదు చేశారు. శుక్రవారం ఉదయం వాండ్రంగి–ఆనందపురం గ్రామాల సమీపంలోని మెట్టు ప్రాంతాలో ఉపాధి వేతనదారులు మృతదేహాన్ని గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతదేహానికి రాజాం సామాజిక ఆస్పత్రి వైద్యులు కొత్తకోట సీతారామమూర్తి, వీఆర్ఓ గోక వెంకటరమణ సమక్షంలో పోస్టుమార్టం పూర్తి చేసి కుటుంబసభ్యులు అప్పగించినట్లు ఎస్ఐ వెలిచేటి సందీప్కుమార్ తెలిపారు.
పోక్సోకేసు నిందితుడికి మూడేళ్ల జైలుశిక్ష
రణస్థలం: జె.ఆర్.పురం పోలీస్ స్టేషన్ పరిధిలో రామచంద్రపురం గ్రామానికి చెందిన బాలికను మరువాడ పంచాయతీ టెక్కలి గ్రామానికి చెందిన కోనేటి నవీన్ అనే వ్యక్తి ప్రేమపేరుతో వేధించినట్లు 2019లో బాలిక తండ్రి ఫిర్యాదు చేశారు. అప్పటి ఎస్సై బి.అశోక్బాబు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. తదుపరి ఎస్సై ఈ.శ్రీనివాస్ చార్జ్షీట్ నమోదు ఫైల్ చేశారు. పబ్లిక్ ప్రొసిక్యూటర్ వి.ఎస్.యు.విశాలాక్షి వాదనలు వినిపించారు. నేరం రుజువైనందున ముద్దాయికి రెండేళ్ల సాధారణ జైలు శిక్ష, ఐదు వేల రూపాయలు జరిమానా, మరో సెక్షన్లో ఏడాది జైలు శిక్ష, ఐదు వేల జరిమానా విధిస్తూ పోక్సో కోర్టు జడ్జి ఎన్.సునీత తీర్పు వెలువరించినట్లు జె.ఆర్.పురం ఎస్సై ఎస్.చిరంజీవి తెలిపారు.
పాతపట్నం: బడ్డుమర్రి గ్రామానికి చెందిన పాల జానకి (42) పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జానకి మద్యానికి బానిస కావడంతో భార్య లక్ష్మి గురువారం మందలించింది. దీంతో మనస్థాపానికి గురై పురుగుల మందు తాగాడు. కొద్దిసేపటికి వాంతులు అవ్వడంతో వెంటనే టెక్కలి జిల్లా ఆసుపత్రికి తరలించారు.అక్కడ ప్రథమ చికిత్స అందించి శుక్రవారం మెరిగైన వైద్యం కోసం శ్రీకాకుళం రిమ్స్కు తరలిస్తుండగా మార్గ మధ్యలో మృతిచెందాడు. జానకి భార్య పాల లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామ ని హెచ్సీ ఆర్.శంకరరావు తెలిపారు.


