ఘనంగా న్యాయసేవా దినోత్సవం
శ్రీకాకుళం పాతబస్టాండ్: స్థానిక కోర్టు ఆవరణలోని న్యాయసేవా సదన్లో జాతీయ న్యాయసేవ దినోత్సవాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఒకటో అదనపు జిల్లా న్యాయమూర్తి పి.భాస్కరరావు మాట్లాడుతూ.. బడుగు బలహీన వర్గాలకు తక్షణ న్యాయం, న్యాయసేవలు అందించడమే జాతీయ లోక్ అదాలత్ ముఖ్య లక్ష్యమన్నారు. ప్రజలకు అవగాహన లేకపోవడం చాలామందికి న్యాయం జరగడం లేదన్నారు. కార్యక్రమంలో స్థానిక న్యాయమూర్తులు 3వ అదనపు జిల్లా జడ్జి సీహెచ్ వివేక్ ఆనంద్ శ్రీనివాస్, స్పెషల్ (పోక్సో) న్యాయమూర్తి ఎన్.సునీత, జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి కె.హరిబాబు, ప్రిన్సిపాల్ సివిల్ జడ్జి ఎం.శ్రీధర్, అడిషనల్ సివిల్ జడ్జి ఆర్.శాంతిశ్రీ, ప్రిన్సిపాల్ సివిల్ జడ్జి జూనియర్ డివిజన్ కె.అనురాగ్, జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు టి.శివప్రసాద్, కార్యదర్శి పిట్టా దామోదరరావు తదితరులు పాల్గొన్నారు.
నూతన కార్యవర్గం ఎన్నిక
శ్రీకాకుళం అర్బన్: ఏపీ పీటీడీ శ్రీకాకుళం జిల్లా జై భీమ్ అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని శుక్రవారం ఆర్టీసీ శ్రీకాకుళం ఒకటో డిపో ఎస్సీ, ఎస్టీ కమిటీ హాల్ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడిగా జేవీ రావు, కార్యదర్శిగా ఏఎస్ చలం, వైస్ ప్రెసిడెంట్గా కె.అచ్చయ్య, జాయింట్ సెక్రటరీగా కె.సోములు, అసిస్టెంట్ సెక్రెటరీగా జె.ఉషారాణి, కోశాధికారిగా బీఎల్ నారాయణ, పబ్లిసిటీ సెక్రటరీగా పి.శ్రీను, కార్యవర్గ సభ్యులుగా కేఎం కుమార్, దాలయ్య, పీయూఎం రావు, కేఆర్ రావు, జి.శారద, ఆర్కే రావు, జీఆర్ రావు తదితరులు ఎన్నికయ్యారు. అనంతరం శ్రీకాకుళం రెండో డిపో మేనేజర్ కేఆర్ఎస్ శర్మను అసోసియేషన్ ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు. కార్యక్రమంలో టెక్కలి డిపో సెక్రటరీ జీఎన్ భూషణ్, సీహెచ్ వెంకటరమణ, పీవీ ఆనంద్, జీఎస్ చలం, డి.శివాజీ తదితరులు పాల్గొన్నారు.
విజేతలై తిరిగి రావాలి
శ్రీకాకుళం న్యూకాలనీ: రాష్ట్రస్థాయి పోటీల్లో సమష్టిగా రాణించి విజేతలై జిల్లాకు తిరిగిరావాలని సాఫ్ట్బాల్ అసోసియేషన్ ఏపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎస్ఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ అధినేత డాక్టర్ సూర శ్రీనివాసరావు సాఫ్ట్బాల్ క్రీడాకారులకు పిలుపునిచ్చారు. గుంటూరు జిల్లా సత్తెనపల్లి వేదికగా ఈనెల 8వ తేదీ నుంచి 10వ తేదీ వరకు జరగనున్న ఏపీ రాష్ట్రస్థాయి సీనియర్స్ పురుషుల సాఫ్ట్బాల్ ఛాంపియన్షిప్–2025 పోటీల్లో పాల్గొనే జిల్లా క్రీడాకారుల బృందం శుక్రవారం ఇక్కడ నుంచి పయనమై వెళ్లింది. ఈ సందర్భంగా క్రీడాకారులకు క్రీడా సామగ్రి, దుస్తులను అందజేశారు. కార్యక్రమంలో సాఫ్ట్బాల్ అసోసియేషన్ ఏపీ రాష్ట్ర కన్వీనర్ మొజ్జాడ వెంకటరమణ, ఒలింపిక్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి ఎం.సాంబమూర్తి, సలహాదారు పి.సుందరరావు, మెట్ట తిరుపతిరావు, ఎం.ఆనంద్కిరణ్, ఎ.ఢిల్లీశ్వరరావు, ఎస్జీఎఫ్ సెక్రటరీ బీవీ రమణ, కె.మాధవరావు, జి.శ్రీనివాసరావు, సీనియర్ క్రీడాకారులు పాల్గొన్నారు.
అక్రమ మద్యం కేసులో జైలుశిక్ష
టెక్కలి రూరల్: అక్రమంగా మద్యం తరలిస్తుండగా పట్టుబడిన గేదెల శేఖర్ అనే వ్యక్తికి జైలుశిక్ష విధించినట్లు టెక్కలి సీఐ విజయ్కుమార్ శుక్రవారం తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. 2023లో బూరగాం గ్రామానికి చెందిన గేదెల శేఖర్ అనే వ్యక్తి 25 మద్యం సీసాలు తరలిస్తుండగా అప్పటి ఏఎస్ఐ రమణ అదుపులో తీసుకుని కేసు నమోదు చేశారు. దీనికి సంబంధించి ఆ వ్యక్తిపై కేసు రుజువు కావడంతో ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ యు.మాధురి ముద్దాయికి 6 నెలల జైలు, రూ.2 లక్షల ఫైన్ విధించినట్లు పేర్కొన్నారు.
10 నుంచి సమ్మేటివ్ పరీక్షలు
నరసన్నపేట: పాఠశాలల్లో విద్యార్థుల సామర్థ్యం తెలుసుకునేందుకు సమ్మేటివ్ ఎసెస్మెంట్– 1 పరీక్షలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈనెల 10వ తేదీ నుంచి ఈ పరీక్షలు నిర్వహించనున్నారు. అన్ని ప్రభుత్వ, ప్రైవేటు స్కూల్స్లో విద్యార్థులు ఈ పరీక్షలు రాయాల్సి ఉంటుంది. జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలు 2,955 ఉండగా.. వాటిలో 2,64,804 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. వీరితో పాటు ప్రైవేటు స్కూల్స్కు చెందిన విద్యార్థులు సైతం పరీక్షలు రాస్తారు. ఏ రోజు ప్రశ్నపత్రాలు ఆరోజు ఆయా మండలాల ఎంఈవోల వద్ద నుంచి తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఈ మేరకు ఏర్పాట్లను విద్యాశాఖ అధికారులు పూర్తి చేశారు. ఇప్పటికే ప్రశ్నపత్రాలను ఆయా మండలాల కేంద్రాల్లోని ఎమ్మార్సీలకు చేర్చారు. ఒకటి నుంచి ఐదు తరగతులకు చెందిన విద్యార్థులకు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 వరకు, 6, 7 తరగతులకు చెందిన విద్యార్థులకు మధ్యాహ్నం 1.15 గంటల నుంచి సాయంత్రం 4.15 గంటల వరకు, 8, 9, 10వ తరగతి విద్యార్థులకు ఉదయం 9.15 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తారు.
ఘనంగా న్యాయసేవా దినోత్సవం


