
సమితి ఇంజినీర్ తీరుపై సభ్యుల ధ్వజం!
జయపురం: జయపురం సబ్డివిజన్ కోట్పాడ్ సమితి ప్రభుత్వ ఇంజినీర్ తీరుపై సమితి సభ్యులు ధ్వజమెత్తారు. కోట్పాడ్ సమితి ఛతర్ల పంచాయతీ డుమాజోడి గ్రామం గులిమి వద్ద సమితి సభ్యులు ఆదివారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సభ్యులు మాట్లాడుతూ.. ప్రభుత్వ ఇంజినీర్ సంతోష్ బాగ్సింగ్ను గత డిసెంబర్లో కోట్పాడ్ సమితి నుంచి బొరిగుమ్మ సమితికి బదిలీ చేశారని.. అయితే నేటి వరకు అతన్ని ఇక్కడ నుంచి రిలీవ్ చేయక పోవటంలో రహస్యం ఏమిటని ప్రశ్నించారు. ఇతనిపై పోలీస్ స్టేషన్లో పలు కేసులు ఉన్నా వాటిని మాఫీ చేశారని ఆరోపించారు. బాగ్సింగ్ సమితి కార్యాలయంలో ఎప్పుడూ ఉండరని ఆరోపించారు. అవసరం నిమిత్తం ఫోను చేసినా ఎత్తకుండా కట్ చేస్తారన్నారు. గత నవంబర్ 25వ తేదీన ఆఫీసు ఆర్డర్ అయిన తరువాత అతడు కోట్పాడ్ సమితిలో ఏ బాధ్యతలు నిర్వహించటం లేదని చెబుతున్నారని.. అయితే కొన్నిసార్లు కార్యాలయానికి వస్తూ ప్రజా ప్రతినిధులు, కంట్రాక్టర్లపై అవమానకరంగా వ్యవహరిస్తున్నారని అరోపించారు. అలాగే సునారబెలి, నువాగాం, చిత్ర, ఘుమర బాధ్యతలు నిర్వహిస్తున్న జూనియర్ ఇంజినీర్ దాస్ ఆయా గ్రామాలకు సమితి కార్యాలయానికి గాని సక్రమంగా రావటంలేదని కొందరు ఆరోపించారు. అభివద్ధి పనులు నాణ్యత హీనంగా చేస్తున్నారని సభ్యులు ఆరోపించారు. సభ్యులు సమితిలో జరుగుతున్న అక్రమాలపై చర్చించారు. సమస్యలు పరిష్కరించక పోతే ఆందోళన చేపడతామని మీడియాకు తెలిపారు. సమావేంలో సమితి ఉపాధ్యక్షులు బాబులి పాణిగ్రహి, గురునాథ్ హరిజన్, ప్రతాప్ సాహు, శుఖదేవ్ బితార్,కాంచన బాగ్,మెలక జాయిఫూల్,జగదీష్ భొత్ర, శ్రీదేవీరావు పాల్గొన్నారు.