గౌతంరెడ్డి కారుకు నిప్పుపెట్టిన నిందితుడు అరెస్ట్
సత్యనారాయణపురం(విజయవాడసెంట్రల్): వైఎస్సార్ సీపీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పూనూరు గౌతంరెడ్డి కారుకు నిప్పు పెట్టిన నిందితుడిని ఎస్ఎన్ పురం పోలీసులు పోలీసులు అరెస్టు చేశారు. ఈ మేరకు గురువారం ఎస్ఎన్పురం పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ ఎస్.వి.వి లక్ష్మీనారాయణ వివరాలు వెల్లడించారు. గత నెల 12న గౌతమ్రెడ్డి కార్యాలయంలోని కింది ఫ్లోర్లో ఉంచిన కారును గుర్తు తెలియని వ్యక్తి పెట్రోలు పోసి నిప్పటించి పరారయ్యాడు. ఈ ఘటనలో కారు పాక్షికంగా కాలిపోయింది. దీనిపై అదేరోజు గౌతంరెడ్డి మెయిల్ ద్వారా పోలీస్ కమిషనర్, ఎస్ఎన్పురం ఇన్స్పెక్టర్కు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నిందితుని కోసం గాలింపు చేపట్టారు.
పాత నేరస్తుడి పనే..
ఇటీవల ఒక న్యూస్ చానల్ డిబెట్లో గౌతంరెడ్డి తన అభిమాన నేతపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడాన్ని జీర్ణించుకోలేకే హైదరాబాద్, బండ్లగూడకు చెందిన పాత నేరస్తుడు హరికోటి లెనిన్ అనే వ్యక్తి గౌతంరెడ్డి కారుపై పెట్రోలు పోసి నిప్పు అంటించినట్లు సీఐ లక్ష్మీనారాయణ వెల్లడించారు. 2005కి ముందు పెజ్జోనిపేటలో నివాసముండే నిందితుడు అనంతరం హైదరాబాద్కు మకాం మార్చాడు. ఇతనిపై గతంలో సత్యనారాయణపురం, కృష్ణలంక, మాచవరం, సూర్యారావుపేట, గవర్నరు పేట పోలీస్ స్టేషన్లలో 15 దొంగతనాల కేసులతో పాటు సస్పెక్ట్ షీటు ఉంది. ఈ క్రమంలో సుమారు రెండు నెలల క్రితం యూట్యూబ్లో గౌతంరెడ్డి ఒక టీవీ చానెల్లో ముఖాముఖీ ప్రోగ్రాంలో తన అభిమాన నేతను విమర్శించి మాట్లాడటాన్ని చూసి జీర్ణించుకోలేకపోయాడు. అందుకు ప్రతీకారం తీర్చుకునే ఉద్దేశంతోనే గత నెల 12న హైదరాబాద్ నుంచి విజయవాడ వచ్చి గౌతంరెడ్డి ఇంటి పరిసరాలలో రెక్కి నిర్వహించాడు. ఆయన కార్యాలయం గ్రౌండ్ ఫ్లోర్లో నిలిపిన కారును దగ్ధం చేసే ఉద్దేశంతోనే బాటిల్లో పెట్రోలు తీసుకువచ్చి ఎవరు లేని సమయంలో కారు వెనుక భాగంలో పెట్రోలు పోసి నిప్పు అంటించి అక్కడ నుంచి పరారయ్యాడు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు అందుబాటులోకి సీసీ కెమెరాల ద్వారా నిందితుడిని గుర్తించారు. గురువారం సత్యనారాయణపురం మట్టిరోడ్డులో ఉన్నట్లు సమాచారం అందటంతో పోలీసులు దాడి చేసి పట్టుకున్నారు. సమావేశంలో ఉమెన్ ఎస్ఐ సౌజన్య, సిబ్బంది పాల్గొన్నారు.
వివరాలు వెల్లడించిన
సీఐ లక్ష్మీనారాయణ


