● కలెక్టర్ ఇలా త్రిపాఠి
● బోధన్లో నియోజకవర్గస్థాయి
‘ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక’ సమావేశం
బోధన్: ప్రభుత్వం చేపట్టే అభివృద్ధి కార్యక్రమాల్లో అన్ని వర్గాల ప్రజలు భాగస్వాములైనప్పుడే సత్వర ప్రగతి సాధ్యమవుతుందని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. పట్టణంలోని ఆచన్పల్లి ప్రాంతంలోగల ఏఆర్ గార్డెన్లో శనివారం నియోజకవర్గస్థాయి ప్ర జాపాలన–ప్రగతిప్రణాళిక కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో ప్రజలను భాగస్వాములను చేయలనే సంకల్పంతో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోందన్నారు. ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి సహకారంతో పట్టణంలోని అన్ని వార్డుల్లో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామని మున్సిపల్ చైర్పర్సన్ తూము పద్మాశరత్ రెడ్డి అన్నారు. వరి ధాన్యం కేంద్రాల నిర్వహణ ద్వారా కమీషన్ రూపంలో సమకూరిన రూ.3కోట్ల 80 లక్షల చెక్కును మహిళా సంఘాల సభ్యులకు కలెక్టర్ అందించారు. అంగన్వాడీ టీచర్లకు సెల్ఫోన్లు, పలువురు లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు పంపిణి చేశారు. అధికారులు, టీపీసీసీ డెలిగెట్ గంగాశంకర్, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.


