
పంట రుణాల పంపిణీకి ప్రాధాన్యమివ్వాలి
నిజామాబాద్ అర్బన్: జిల్లాకు వ్యవసాయమే ప్రధాన ఆధారంగా ఉన్నందున పంట రుణాల పంపిణీకి అధిక ప్రాధాన్యమివ్వాలని కలెక్టర్ టీ వినయ్ కృష్ణారెడ్డి హితవు పలికారు. రుణాల పంపిణీలో నిర్దేశిత లక్ష్యాలను పూర్తిస్థాయిలో సాధించేందుకు అంకిత భావంతో కృషి చేస్తూ, ఆయా వర్గాల అభ్యున్నతికి బ్యాంకర్లు దోహదపడాలని సూచించారు. కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో శుక్రవారం జిల్లా స్థాయి బ్యాంకర్ల సంప్రదింపుల కమిటీ త్రైమాసిక సమావేశం నిర్వహించారు. ఖరీఫ్, రబీ సీజన్లకు సంబంధించి కేటాయించిన లక్ష్యాలు, సాధించిన ప్రగతి, ప్రస్తుత సీజన్కు అందించాల్సిన పంట రుణాలు తదితర అంశాలపై బ్యాంకుల వారీగా సమీక్షించారు. 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రుణ ప్రణాళికను విడుదల చేశారు. వ్యవసాయ, అనుబంధ, వ్యవసాయేతర, ఇతర అన్ని రంగాలకు కలిపి రూ. 17990.59 కోట్ల రుణాలు అందించాలని లక్ష్యంగా నిర్ణయించారు. ఇందులో ప్రాధాన్యత రంగాలకు రూ. 13928.92 కోట్ల రుణ సదుపాయం కల్పించాలని పేర్కొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పూర్తిస్థాయిలో పంట రుణాల లక్ష్యాన్ని సాధించేందుకు బ్యాంకర్లు చొరవ చూపాలన్నారు. విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించేందుకు వీలుగా విద్యా రుణాలను అందించాలన్నారు. వివిధ వర్గాల అభ్యున్నతి, ఆర్థిక ప్రగతి కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న కార్యక్రమాలు, పథకాలకు బ్యాంకర్లు సహకరించాలన్నారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు బ్యాంకింగ్ సేవలను సమర్థవంతంగా అందించాలన్నారు. వీధి వ్యాపారాలు నిర్వహించే వారికి సూక్ష్మ రుణాలను త్వరితగతిన మంజూరు చేయాలన్నారు. ప్రభుత్వ పథకాల కింద ఎంపికై న లబ్ధిదారులకు సకాలంలో రుణాలు అందించి స్వయం ఉపాధికి చేయూతనివ్వాలన్నారు. ఎస్బీఐ ఆధ్వర్యంలో స్వయం ఉపాధి కోర్సుల్లో శిక్షణ పూర్తి చేస్తున్న గ్రామీణ ప్రాంత యువత యూనిట్ల స్థాపన కోసం రుణాలివ్వాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ అంకిత్, ఆర్బీఐ ఎల్డీవో రాములు, డీఆర్డీవో సాయాగౌడ్, లీడ్ బ్యాంక్ జిల్లా మేనేజర్ అశోక్ చవాన్, నాబార్డు ఏజీఎం ప్రవీణ్ కుమార్, వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు, బ్యాంకర్లు తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ టీ వినయ్ కృష్ణారెడ్డి
జిల్లా స్థాయి బ్యాంకర్ల సమావేశంలో వార్షిక రుణ ప్రణాళిక విడుదల
రూ.17990.59 కోట్ల
రుణ లక్ష్యం ఖరారు