హిందుస్థానీ గాయకుడు రాజన్ మిశ్రా కన్నుమూత
న్యూఢిల్లీ: ప్రముఖ హిందుస్థానీ గాయకుడు రాజన్ మిశ్రా (70) ఆదివారం కరోనాతో కన్నుమూశారు. సోదరుడు సజన్ మిశ్రాతో కలిసి రాజన్ ‘ఖయాల్ గాయకీ’ శైలికి విశేష ప్రాచుర్యం కల్పించారు. కాగా మూడురోజులుగా సెయింట్ స్టీఫెన్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రాజన్ పరిస్థితి ఆదివారం సాయంత్రం విషమించింది. అయితే వెంటిలేటర్ బెడ్ కోసం వెదకగా ఫలితం లేకుండా పోయింది.
దీంతో, శ్రేయోభిలాషులు, మిత్రులు సోషల్ మీడియా ద్వారా సాయం కోరారు. చివరకు ప్రధాని కార్యాలయం స్పందించి వెంటిలేటర్ సదుపాయాన్ని కల్పిస్తామని కుటుంబసభ్యులను సంప్రదించింది. కానీ అప్పటికే రాజన్ మిశ్రా గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయారని ఆయన కుమారుడు రజనీష్ తెలిపారు.