అబార్షన్ పరిమితి 24 వారాలకు పెంపు
న్యూఢిల్లీ: ప్రత్యేక కేటగిరీల మహిళలకు గర్భ విచ్ఛిత్తి(అబార్షన్) గరిష్ట పరిమితిని 20 వారాల నుంచి 24 వారాలకు పెంచేందుకు ఉద్దేశించిన బిల్లును పార్లమెంట్ ఆమోదించింది. లైంగిక దాడి బాధితులు, మైనర్లు, దివ్యాంగులు, వావివరుస తప్పిన ఫలితంగా గర్భం ధరించిన వారికి ఈ పరిమితి వర్తించనుంది. లోక్సభ ఏడాది క్రితమే ఆమోదించిన మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ సవరణ బిల్లు–2020కు మంగళవారం రాజ్యసభ మూజువాణి ఓటుతో ఆమోదం తెలిపింది. 20 వారాలకు పైబడిన 24 వారాలకు మించని గర్భాలకు ప్రత్యేక కేటగిరీలోకి వస్తుంది.
గర్భం కారణంగా ఆ మహిళ ప్రాణానికి హాని కలుగుతుందని లేదా ఆమె శారీరక, మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుందని లేదా జన్మించే శిశువుకు తీవ్ర శారీరక, మానసిక అవకరాలు కలుగుతాయని వైద్యులు సిఫారసు చేసిన సందర్భాల్లో ఈ చట్టంలోని నిబంధనలు వర్తిస్తాయి. ఇలాంటి ప్రత్యేక కేటగిరీ కేసులను పరిశీలించేందుకు రాష్ట్రాలు గైనకాలజిస్ట్, రేడియాలజిస్ట్, పీడియాట్రీషియన్, మరొకరితో ప్రత్యేక మెడికల్ బోర్డును ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. గర్భస్రావం చేసిన వైద్యుడు ఆ మహిళ పేరు, ఇతర వివరాలను ఎట్టి పరిస్థితుల్లోనూ బహిరంగపర్చరాదు.