‘మాట వినకపోతే.. ఇక ‘ఫార్ములా 66’’
కేంద్రాన్ని హెచ్చరించిన రైతు సంఘాల నాయకులు
న్యూఢిల్లీ: కేంద్రం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తోన్న ఉద్యమం 33వ రోజుకు చేరుకుంది. ఇక రైతుల సంఘాల నేతలతో కేంద్రం ఐదు సార్లు జరిపిన చర్చలు విఫలం కాగా సుప్రీం కోర్టు జోక్యం చేసుకుంది. వారి సమస్యల పరిష్కారానికి ఒక కమిటీ వేయాలని ఆదేశించిన సంగతి తెలిసిందే. కేంద్రంతో మరోసారి చర్చల నేపథ్యంలో రైతు సంఘాల నాయకులు హెచ్చరికలు జారీ చేశారు. ఈ సారి కూడా కేంద్రం తమ మాట వినకపోతే తమ తదుపరి అడుగు ‘ఫార్ములా 66’ అని హెచ్చరించారు. (చదవండి: రాహుల్ ఫారిన్ ట్రిప్.. కుష్బు కామెంట్స్)
ఈ సందర్భంగా రైతు సంఘం నాయకుడు రాకేష్ టికైత్ మాట్లాడుతూ.. ‘ఉద్యమం ప్రారంభించి ఇప్పటికి 33 రోజులు. చర్చలు ఇంకా ఓ కొలిక్కి రాలేదు. ప్రభుత్వం మా మాట వినకపోతే.. మేం ‘ఫార్ములా 66’ ని అమలు చేస్తాం. అంటే ఇప్పటికి రెట్టింపు రోజులు మా ఆందోళనని కొనసాగిస్తాం’ అని హెచ్చరించారు. ఇక ఇప్పటికే దేశవ్యాప్తంగా పలువురు సెలబ్రిటీలు రైతుల ఉద్యమానికి మద్దతు తెలుపుతున్న సంగతి తెలిసిందే.