కరోనా: భారత్లో 40 వేలు దాటిన మరణాలు
న్యూఢిల్లీ : భారత్లో కరోనా వైరస్ అంతకంతకూ విసర్తిస్తోంది. ప్రతి రోజు రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. గత కొన్ని రోజులుగా 50 వేలకు పైగా పాజిటివ్ కేసులు వెలుగుచూస్తుండటంతో పరిస్థితి ఆందోళనకరంగా మారుతోంది. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 56,282 మంది కరోనా బారిన పడ్డారు. నిన్న ఒక్కరోజే(బుధవారం) అత్యధికంగా 904 మంది కరోనాతో మృత్యువాత పడ్డారు. ఈ మేరకు కేంద్ర వైద్యారోగ్య శాఖ గురువారం హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
దీని ప్రకారం దేశంలో ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 19,64,537కు చేరింది. కరోనా బారిన పడి మొత్తం 40,699 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం 5,95,501 యాక్టివ్ కేసులు ఉండగా, 13,28,337 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఇక బుధవారం 6,64,949 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా ఇప్పటి వరకు మొత్తం 2,21,49,351 టెస్టులు పూర్తి చేశారు. (కరోనాను జయించిన 105 ఏళ్ల బామ్మ.. )