ఢిల్లీ : మెట్రో సర్వీసుల పునరుద్ధరణపై ఆశాభావం
కేంద్ర నిర్ణయంపై కేజ్రీవాల్ ఆశాభావం
సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధానిలో కోవిడ్-19 తగ్గుముఖం పట్టడంతో ప్రయోగాత్మక పద్ధతిన ఢిల్లీలో మెట్రో రైలు సేవలను పునరుద్ధరించే అవకాశం ఉందని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆదివారం వెల్లడించారు. మెట్రో రైళ్ల రాకపోకల పునరుద్ధరణపై కేంద్ర ప్రభుత్వం త్వరలోనే ఓ నిర్ణయం తీసుకోవచ్చని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. డిజిటల్ సంవాద్ పేరుతో నగర వ్యాపారులు, పారిశ్రామికవేత్తలతో కేజ్రీవాల్ మాట్లాడుతూ మెట్రో రైళ్ల పునరుద్ధరణపై కేంద్ర ప్రభుత్వంతో పలుమార్లు ప్రస్తావించామని, దీనిపై త్వరలో నిర్ణయం వెలువడుతుందని అన్నారు.
ఢిల్లీలో కరోనా వైరస్ తగ్గుముఖం పట్టినందున ఇతర నగరాల్లో మెట్రో సర్వీసులను పునరుద్ధరించకున్నా ఢిల్లీలో మాత్రం ప్రయోగాత్మకంగా మెట్రో రైళ్లను అనుమతించాలని పేర్కొన్నారు. దశలవారీగా మెట్రో సర్వీసులను సాధారణ స్థితికి తీసుకురావచ్చని సూచించారు. చాందినీచౌక్ అభివృద్ధి ప్రాజెక్టు తరహాలో ఢిల్లీలో రోడ్లు, మార్కెట్లను సుందరీకరిస్తామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. మరోవైపు ఢిల్లీలో ఆదివారం 1450 తాజా పాజిటివ్ కేసులు వెలుగుచూడటంతో మొత్తం కేసుల సంఖ్య 1.61 లక్షలకు పెరిగింది. వీరిలో 1.45 లక్షల మంది వ్యాధి నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. దేశ రాజధానిలో ప్రస్తుతం 627 కంటైన్మెంట్ జోన్లలో 11,778 యాక్టివ్ కేసులున్నాయి. చదవండి : ఈ బస్సు ఎక్కాలంటే రూ.15 లక్షలు కట్టాలి!