నారాయణపేట: జిల్లాలో గుట్టుగా సాగుతున్న పేకాటపై ‘జోరుగా జూదం’ శీర్షికన శుక్రవారం ‘సాక్షి’లో కథనం ప్రచురితమైంది. ఇందుకు స్పందించిన కోస్గి ఎస్ఐ బాలరాజు సిబ్బందితో కలిసి పట్టణ సమీపంలోని చెన్నారం రోడ్లో కొనసాగుతున్న పేకాట స్థావరంపై శుక్రవారం సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో దాడి చేశారు. 9 మంది పట్టుబడ్డారని వారినుంచి 5 సెల్ఫోన్లు, పేక ముక్కలు, రూ.29,180 స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ తెలిపారు. కాగా ఆ సమయంలో పేకాట ఆడుతూ పట్టుబడింది 12 మంది కాగా.. అందులో ముగ్గురిని తప్పించినట్లు తెలుస్తోంది. డబ్బులు తీసుకొని వదిలేశారంటూ చర్చ జరుగుతోంది. పట్టుబడిన వారిలో ఓ రైస్మిల్లు యజమాని, ఓ బడా వ్యాపారి, మరో వ్యక్తి ఉండగా.. వారి నుంచి భారీ మొత్తంలో డబ్బులు తీసుకొని వదిలేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆ ముగ్గురిని తప్పించడంలో ఎస్పీ కార్యాలయానికి చెందిన ఓ కానిస్టేబుల్, అధికార పార్టీకి చెందిన ఓ కౌన్సిలర్ మధ్యవర్తులుగా వ్యవహరించినట్లు ప్రచారం సాగుతోంది. దాడిలో రూ.29,180 మాత్రమే స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు చెబుతుండగా.. సుమారు రూ.లక్షకు పైగా ఉండవచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సెల్ఫోన్లు సైతం 14 దొరికితే కేవలం 5 మాత్రమే స్వాధీనం చేసుకొని కేసులో పేర్కొనడం మరిన్ని అనుమానాలకు తావిస్తోంది. పూర్తిస్థాయి విచారణ జరిపి వాస్తవాలను వెల్లడించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
పట్టుబడ్డది 12 మంది..
కేసులు 9 మంది పైనే..?
డబ్బులు తీసుకొని తప్పించారని బాధితుల ఆవేదన
5 సెల్ఫోన్లు, నగదు స్వాధీనం
నగదు, మొబైల్స్ లెక్కలపై అనుమానాలు


