● టీడీపీ సానుభూతి పరులైన
కంప్యూటర్ ఆపరేటర్లను మార్చాలి
● బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే
కాటసాని రామిరెడ్డి
నంద్యాల: ఓటర్ల జాబితా సవరణలో ఎలాంటి పక్షపాతం లేకుండా అధికారులు నిజాయితీగా పని చేయాలని బగానపల్లె మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి పేర్కొన్నారు. సోమవారం పీజీఆర్ఎస్ కార్యక్రమంలో బనగానపల్లెలో జరుగుతున్న ఓటర్ల జాబితా సవరణలో తప్పులు దొర్లే అవకాశం ఉందని, ఇందుకు సంబంధించిన వివరాలను డీఆర్ఓ రామునాయక్కు కాటసాని రామిరెడ్డి సోమవారం వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా కాటసాని రామిరెడ్డి మాట్లాడుతూ.. బనగానపల్లె మండలంలో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ కార్యాలయాల్లో ఎన్నికల విధులకు అశోక్రెడ్డి, చింతల నాగిరెడ్డిలను కంప్యూటర్ ఆపరేటర్లుగా నియమించారని, వీరు స్థానిక తెలుగుదేశం పార్టీ కుటుంబాలకు చెందిన వారు అని పేర్కొన్నారు. ఓటర్ల జాబితా నిర్వహణలో ఇలాంటి వారిని కొనసాగిస్తే పక్షపాత ధోరణితో ఓ పార్టీ వైపు వీరు వ్యవహరించే అవకాశం ఉందన్నారు. నియోజకవర్గంలో వీరిద్దరి నియామకంపై తీవ్ర అపోహలు, అనుమానాలు ఉన్నాయన్నారు. ఎన్నికల ప్రక్రియలో నిష్పక్షపాతంగా ఉండేందుకు ఈ ఇద్దరు ఆపరేటర్లను తక్షణమే బనగానపల్లె నియోజకవర్గం నుంచి వేరే ప్రాంతాలకు బదిలీ చేయాలన్నారు. స్వేచ్ఛాయుత, న్యాయబద్ధమైన ఎన్నికల నిర్వహణ కోసం వీరిని మార్చి వేరే వారిని నియమించాలన్నారు. ఓటర్ల జాబితా సవరణ, చేర్పులు, తొలగింపులు వంటి అత్యంత కీలకమైన పనుల్లో అధికార పార్టీకి అనుకూలంగా ఉండే వీరిని నియమించడం వల్ల ఎన్నికల ప్రక్రియ దెబ్బతింటుందన్నారు. ఎన్నికల ప్రక్రియలో పారదర్శకతను కాపాడేందుకు తక్షణమే వీరిని బదిలీ చేయాలన్నారు.


