● కోర్టు కానిస్టేబుళ్లతో అడిషనల్ ఎస్పీ సమీక్ష
కర్నూలు: కేసుల దర్యాప్తులో న్యాయ ప్రక్రియను వేగవంతం చేయడానికి ఆధునిక సాంకేతికతను సమర్థవంతంగా వినియోగించాల్సిన అవసరముందని అడిషనల్ ఎస్పీ హుసేన్ పీరా అన్నారు. జూలై 11న లోక్ అదాలత్ జరగనున్న నేపథ్యంలో ఈ–సమన్లు, ఈ–ప్రాసిక్యూషన్, ఏపీఓఎల్ఐఎస్ యాప్ వినియోగంపై పోలీసు కార్యాలయంలోని వ్యాస్ ఆడిటోరియంలో కోర్టు కానిస్టేబుళ్లు, పోలీసు అధికారులతో ఏఎస్పీ సోమవారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కోర్టులకు సంబంధించిన ఈ–సమన్ల జారీ, వాటిని సకాలంలో అమలు, డిజిటల్ విధానంలో నివేదికల వంటి అంశాలపై పలు సూచనలు చేశారు. ప్రాసిక్యూషన్ వ్యవస్థ ద్వారా కేసుల వివరాలు, చార్జిషీట్లు, కోర్టు విచారణ సమాచారాన్ని పబ్లిక్ ప్రాసిక్యూటర్ల సహాయంతో ఆన్లైన్లో సమర్థవంతంగా నిర్వహించాల్సిన అవసరముందని వివరించారు. కోర్టు కేసుల పురోగతిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ పెండింగ్ అంశాలను తగ్గించేలా చర్యలు చేపట్టాలని సూచించారు. మెగా లోక్ అదాలత్లో పెండింగ్ కేసులలో రాజీ పరిష్కారమయ్యే కేసులను గుర్తించి సంబంధిత పక్షాలకు సహకారం అందించాలన్నారు. డీసీఆర్బీ సీఐ గుణశేఖర్ బాబు, కోర్టు మానిటరింగ్ సీఐ రామయ్య నాయుడుతో పాటు కోర్టు కానిస్టేబుళ్లు, ఇతర పోలీసు అధికారులు కార్యక్రమంలో పాల్గొన్నారు.


